Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్యాంకులు ఖాతాదా రులకు అందిస్తోన్న కొన్ని ఉచిత సేవలు కొత్తగా అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి రావని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. రెవెన్యూ విభాగాన్ని సంప్రదించిన తర్వాత ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్థికశాఖ వెల్లడించింది. 'బ్యాంకులు అందించే ఉచిత సేవలపై జీఎస్టీ విధించాలా? వద్దా? అన్న అంశంపై ఆర్థిక సేవల విభాగం రెవెన్యూ శాఖతో సంప్రదింపులు జరిపింది. ఆ సేవలకు జీఎస్టీ విధించాల్సిన అవసరం లేదని రెవెన్యూశాఖ తెలిపింది. దీంతో వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం లేదు' అని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చెక్ బుక్, అకౌంట్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా లాంటి లావాదేవీలపై ఛార్జీ విధించకపోవడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు కాని సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావచ్చా? అన్న అంశాన్ని చర్చిస్తున్నామని ఇటీవల ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే బ్యాంకుల యాజమాన్యం తరఫున పన్ను అధికారులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓ ప్రతిపాదన చేసింది. ఇదిలా ఉండగా.. బ్యాంకులు 'ఉచిత సేవలు' అందించడం లేదని, ఖాతాలో కనీస నిల్వ కొనసాగించాలని చెబుతూ రుసుములు వసూలు చేస్తుంటాయనే అభిప్రాయాన్ని పన్ను అధికారులు వ్యక్తం చేశారు. ఒక్కో బ్యాంకు కనీస నిల్వ విలువను ఒక్కోలా నిర్దేశిస్తూ, తదనుగుణంగా ఉచిత సేవలు అందిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖతో చర్చలు జరిపిన ఆర్థికశాఖ ఉచిత సేవలపై జీఎస్టీని విధించబోమని స్పష్టం చేసింది.