Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో కీలక వాటాను కొనుగోలుకు మేటి బిడ్ను దాఖలు చేసిన సంస్థ వివరాలు ఆగస్టులోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సర్కారు తెలిపింది. ఎయిరిండియాకు అత్యధిక బిడ్ను దాఖలు చేసిన సంస్థ గణనీయమైన యాజమాన్యం, ప్రభావవంతమైన యాజమాన్య నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుందని విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎస్ చౌబే తెలిపారు. బిడ్ల దాఖలు విలువకు సరితూగని విధంగా లేని పక్షంలో ఎయిరిండియాను విక్రయించాలో.. వద్దో నిర్ణయించే అధికారం ప్రభుత్వమే కలిగి ఉంటుందని ఆయన అన్నారు. ఎయిరిండియా కొనుగోలుకు దేశీయ విమానయాన సంస్థ ఏదీ ఇప్పటి వరకు ముందుకు రాలేదని చౌబే తెలిపారు. అయితే చాలా సంస్థలు ఎయిరిండియాపై ఆసక్తితో ఉన్నాయని అన్నారు. ఎయిరిండియాలో 76% వాటాను విక్రయించేందుకు బిడ్లను కూడా ఆహ్వానించింది. అయితే వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. ఎయిరిండియాలో వాటా విక్రయం ప్రక్రియను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. కఠిన నిబంధనలే ఎయిరిండియాలో కీలక వాటా విక్రయానికి ఆటంకంగా నిలుస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థకు విమానయన వ్యాపారంలో తగిన అనుభవం ఉండాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది.