Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్పీసీఎల్ సీఎండీ ముఖేష్
న్యూఢిల్లీ : ప్రస్తుత సమయంలో పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న పన్నులను సమీక్షించాల్సిన అవసరం ఉందని హెచ్పిసిఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ముఖేస్ కుమార్ సురానా పేర్కొన్నారు. చమురు ఉత్పత్తుల ధరలు ఆల్టైం గరిష్ట స్థాయిని తాకాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్లపై వరుసగా 10వ రోజూ ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు చూస్తుంటే దేశీయంగా కూడా ధరలు దిగివచ్చే సంకేతాలు లేవన్నారు. పెరుగుతున్న ఈ ధరలపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చర్చలకు అయితే తనకు సమాచారం లేదన్నారు.
కర్నాటక ఎన్నికలు జరిగే వరకూ 19 రోజుల పాటు మోడీ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచకుండా నిలుపుదల చేసింది. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా పెంచూతూ లీటర్ పెట్రోల్ ధరను రూ.80 పైకి చేర్చింది. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆలోచనలు చేస్తున్నామని ముఖేస్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పన్నులను సమీక్షించాలని కోరారు. కాని ఎలా చేయాలనేది దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూపాయి పెరిగితే దాదాపుగా ప్రజలపై రూ.13,000 కోట్ల భారం పడుతుందని అంచనా. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య మోడీ ప్రభుత్వం తొమ్మిది సార్లు ఎక్సైస్ డ్యూటీ పెంచింది. గత ఆక్టోబర్లో కేవలం ఒకే ఒక సారి లీటర్పై రూ.2 పన్ను తగ్గించింది. ఆ 15 మాసాల్లో పెట్రోల్పై రూ.11.77, డీజిల్పై రూ.13.47 చొప్పున ధరలు పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ రూపంలో ప్రజలపై రూ.2.42 లక్షల కోట్ల భారం వేసింది.