Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2050 నాటికే పూర్తి విద్యుత్తు వాహనాలు : టయోటా వైస్ చైర్మెన్ శేఖర్ విశ్వనాథన్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ వ్యాప్తంగా 2030 నాటికి దేశంలో పూర్తిగా విద్యుత్తు వాహనాలే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. 2050 వరకు ఇది సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వైస్ చైర్మెన్, సంస్థ శాశ్వత డైరెక్టర్ శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. కంపెనీ కొత్తగా రూపొందించిన టయోటా యారిస్ వాహనాన్ని గురువారం ఆయన తెలంగాణ మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో పూర్తిగా విద్యుత్తు వాహనాలే తిరిగేలా చూడాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అయితే వాస్తవాలు గమనించి ప్రభుత్వం లక్ష్యం నుంచి వెనకడుగు వేసిందని వివరించారు. దేశంలో విద్యుత్తు వాహనాలు తిరిగేందుకు తగ్గ పరిస్థితులను, మౌలిక వసతులను కల్పించేందుకు గాను సర్కారుకు కనీసం 20 నుంచి 30 సంవత్సరాల గడువు పడుతుందని అన్నారు. పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చే వరకు హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడమే సరైన చర్య అని తాము సర్కారు సూచించినట్టుగా ఆయన తెలిపారు. అయిన హైబ్రిడ్ వాహనాలకు అసవరమైన మౌలిక వసతులను కల్పించే దిశగా సర్కారు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విశ్వనాథన్ వివరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 4000 కొత్త యారిస్ వాహనాలు అందుబాటులో ఉంచనున్నట్టుగా వివరించారు. విద్యుత్తు, హైడ్రోజన్, హైబ్రిడ్ హైడ్రోజన్ వాహనాలకు తోడు రానున్న అయిదేండ్ల కాలంలో అందుబాటులోకి రానున్న అన్ని రకాల కొత్త టెక్నాలజీలతో వాహనాలను రూపొందించేందుకు గాను తమ సంస్థ సన్నంద్ధంగా ఉందని తెలిపారు.