Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకు ఉద్యోగుల తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తమకు గౌరవప్రదమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30 ఉదయం 6 గంటల నుంచి జూన్ 1 ఉదయం 6 గంటల వరకు అంటే దాదాపు 48 గంటల పాటుఉద్యోగులు సమ్మెలో ఉండనున్నారు. ఉద్యోగులు ప్రధానంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ న్యాయపరమైన వేతన సవరణను కోరుతుండగా.. ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పడూ వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు వేతన సవరణ విషయమై దాదాపు 12 దపాలుగా చర్చలు జరిపినప్పటికీ ఈ సమస్యకు ఇప్పటి వరకు పరిష్కారం చూపలేకపోయిందని ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమం తప్పకుండా నికరలాభాలు ఆర్జిస్తున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో వెలుగు చూసిన భారీ ఎగవేతలు, ఎన్పీఏలకు కేటాయింపులను సాకుగా చూపుతూ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) కేవలం 2 శాతం వేతన సవరణను మాత్రమే అమోదయోగ్యమని, అది కూడా కొన్ని కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేయనున్నట్టుగా ఐబీఏ ఇటీవలి చర్చల్లో వెల్లడించడాన్ని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగులు మాత్రం కనీసం 15% వేతన సవరణను చేపట్టాలని పట్టుబడతున్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ యొక్క అసంబద్ధమైన సవరణ ప్రతిపాదనను తిరస్కరిస్తూ యూనిటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగులను విభజించు.. పాలించు అనే పద్ధతిలో ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని నాయకులు ఆరోపించారు. వేతన సవరణ విషయంలో ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్కు తాము వ్యతిరేకమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ వెల్లడించింది. యూనియన్ కన్వీనర్ వీవీఎస్ఆర్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకు ఉద్యోగులందరికీ వేతన సవరణ జరుపాలని రెండు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున బ్యాంక్ ఉద్యోగుల సమ్మె తప్పే పరిస్థితులు కనిపించడంలేదు
సిండికేట్ బ్యాంక్లో నిరసన ప్రదర్శన
వేతన సవరణలో జాప్యాన్ని ఆక్షేపిస్తూ బ్యాంక్ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు హైదరాబాద్లోని సిండికేట్ బ్యాంక్ జోనల్ కార్యాలయం, రిజినల్ కార్యాలయాలు 1,2లలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో 'నిరసన కార్యక్రమాన్ని' చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వి. సమర్పణరాజు మాట్లాడుతూ ఐబీఏ రెండు శాతం వేతన సవరణను తిరస్కరించారు. కార్యక్రమంలో ఎస్బీఈయూ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సైయ్యద్ ఇక్భాల్ మాట్లాడుతూ ఈ నెలాఖరున తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను విజయవంత చేయాలని పిలుపునిచ్చారు.