Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3,600 కోట్ల జరిమానా విధించిన అమెరికా కోర్టు
శాన్జోస్: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏడేండ్ల ్ల నాటి యాపిల్ డిజైన్ పేటెంట్ కేసుకు సంబంధించి అమెరికా ఫెడరల్ కోర్టులో శాంసంగ్కు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. ఐఫోన్ డిజైన్ను కాపీ చేసినందుకు గానూ శాంసంగ్.. యాపిల్కు 533 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3,600కోట్లు) చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రెండు పేటెంట్ల ఉల్లంఘనలకు గానూ మరో 5 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. శాంసంగ్ సంస్థ తమ ఐఫోన్ డిజైన్ను కాపీ కొట్టిందంటూ 2011లో ఆపిల్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గుండ్రటి ఎడ్జ్లతో ఉండే ఐఫోన్ బ్లాక్ స్క్రీన్, బేజెల్, గ్రిడ్ ఐకాన్లను శాంసంగ్ కాపీ కొట్టిందని యాపిల్ ఆరోపించింది. ఇందుకు గానూ శాంసంగ్ నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టుకు ఎక్కింది. తమ డిజైన్ ద్వారా శాంసంగ్ కంపెనీకి లాభం వచ్చింది గనుక ఆ లాభాల్లో 1 బిలియన్ డాలర్లను యాపిల్కు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే శాంసంగ్ మాత్రం తాము 28 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తామంటూ భీష్మించుకు కూర్చుంది. ఇదే అంశంపై గత కొన్నేండ్లుగా ఇరు సంస్థల మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. తాజాగా శాన్జోస్లోని ఫెడరల్ కోర్టు దీనిపై తీర్పు వెల్లడించింది. యాపిల్ డిజైన్ను కాపీ కొట్టడం ద్వారా శాంసంగ్కు వచ్చిన లాభం ఎంత అనేదాన్ని కోర్టు అధ్యయనం చేసింది. ఆ తర్వాత శాంసంగ్ 533 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందేనని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.