Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిక్కెట్లపై జీఎస్టీ భారం మోపడం సరికాదు: అసోచామ్- సీడబ్ల్యూసీ సర్వే వెల్లడి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సగటు జీవికి కనీస వినోదంగా ఉంటూ వస్తోన్న సినిమాలపై కూడా జీఎస్టీ పన్ను భారం మోపాలని సర్కారు యోచన సరైంది కాదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నట్టుగా పరిశ్రమల సమాఖ్య అసోచామ్-పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వేలో తేలింది. సినిమా టిక్కెట్లపై జీఎస్టీ విధింపు సరైన చర్య కాదని అత్యధిక మంది అభిప్రాయపడుతున్నట్లు ఈ సర్వే నివేదిక తెలిపింది. 'సినీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం' అనే దానిపై సర్వే రిపోర్టును గురువారం అసోచామ్-పీడబ్ల్యూసీలు హైదరాబాద్లో విడుదల చేశారు. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సామాజిక అభివృద్ధి అంశాలను గమనిస్తే మెట్రో సిటీల్లో కూడా వాస్తవంగా సినిమా అనేది విలాసవంతమైన వినోదం (లగ్జరీ) కాదని అధ్యయనంలో తేలినట్లు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో సినిమాను విలాసవంతమైన వినోదం కింద జతకడుతూ జీఎస్టీ విధించడం సరైన చర్య కాదని నివేదిక తెలిపింది. జీఎస్టీకి తోడు కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు వినోదపు పన్నును విధించుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తున్న నేపథ్యంలో సినిమాకు వెళ్లాలంటేనే సామాన్యుడు జడుసుకొనే పరిస్థితి ఏర్పడనుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. రూ.100ల కంటే అధిక ధర పలికే సినిమా టిక్కెట్లను జీఎస్టీ నిబంధనలు విలాసంగా భావిస్తూ 28% పన్నును సూచిస్తున్నాయి. రూ.100లోపు టిక్కెట్లకు 18% జీఎస్టీ వర్తించనుంది. దీనికి తోడు స్థానిక పన్నులు సినిమా టిక్కెట్లను మరింత భారంగా మార్చనున్నాయని నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా అసోచామ్ మిడియా అండ్ ఎంటర్టైన్మెంట్ జాతీయ కౌన్సిల్ చైర్మెన్ కె.వి.రావు మాట్లాడుతూ సినీ పరిశ్రమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పన్ను విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు.
థియేటర్లకు వచ్చే వారు తగ్గుతారు : తమ్మారెడ్డి
సినిమా టిక్కెట్లపై ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను విధానం వల్ల రానున్న కొన్ని వారాల్లో టిక్కెట్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుగు సినిమా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.150 టికెట్పై 28 శాతం పన్ను చెల్లించడం ద్వారా ఆ టికెట్ భారం మరో రూ.42 పెరుగుతుందన్నారు. వచ్చే కొద్ది వారాల్లోనే తప్పకుండా టికెట్ల ధరలు పెరగనున్నాయని అన్నారు. దీంతో కుటుంబంతో కలిసి వచ్చే వారిపై భారం పెరగనుందని, ఈ క్రమంలో సాధరణంగానే సినిమా టాకీసులకు వచ్చే వారి సంఖ్య పడిపోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రవత్ మాట్లాడుతూ మూవీ టికెట్లపై పన్ను రేట్లను తగ్గించాలన్నారు. అదే విధంగా అమ్యూజింగ్ పార్కుల వినియోగదారులపై కూడా 18 శాతం పన్ను రేటు ఉందని, దీన్నీ సమీక్షీంచాలన్నారు. తెలంగాణలోని మెడ్చల్ జిఎస్టి కమిషనరేట్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పన్నులపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని సూచించారు.