Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగం ప్రక్షాళణ దిశగా అడుగులు వేస్తోన్న భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) దేశంలోని అతిపెద్ద నిరర్థక ఆస్తులు వాటికి బ్యాంకులు ప్రత్యేకంగా జరుపుతోన కేటాయింపులపై ప్రత్యేక నజర్ పెట్టింది. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిలో కొనసాగుతున్న దాదాపు 200 పెద్ద అప్పు ఖాతాలు.. వాటికి ఆయా బ్యాంకులు జరిపిన కేటాయింపులపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఒత్తిడిలో ఉన్న ఆయా ఖాతాల పరిశీలనను ప్రారంభించింది. ఈ నిరర్ధక ఆస్తుల విషయంలో బ్యాంకులు నిర్ధిష్టమైన నిబంధనలు పాటించాయా లేదా అనే దానిపై తొలుత సమాచారం సేకరిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి ఒక్కరు పేర్కొన్నారు. ముఖ్యంగా రుణాలపై అంచనా, కేటాయింపులు, రుణాల పునరుద్ధ్దరణపై ఆర్బీఐ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ పరిశీలనలో ఉన్న సమస్యాత్మక పెద్ద ఖాతాల్లో వీడియోకాన్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ తదితర సంస్థలు ఉన్నట్టుగా సమాచారం. 2018 మార్చి ముగింపు నాటికి బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్ధక ఆస్తులు రూ.10.3 లక్షల కోట్లకు చేరి, 11.2 శాతంగా నమోదయ్యాయి. 2017 ఇదే మార్చి నాటికి మొండి బాకీలు రూ.8 లక్షలతో 9.5 శాతంగా చోటు చేసుకున్నాయి. గతేడాది జరిపిన వార్షిక తనిఖీల్లో యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యస్ బ్యాంకులు మొండి బాకీలను తక్కువగా చూపి దొరికి పోయాయి. ఆ బ్యాంకులు మొండి బాకీల కోసం కేటాయింపులు తక్కువగా చేసి చూపెట్టాయి. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు తమకు నిరర్ధక ఆస్తుల సమగ్ర వివరాలను అందజేయాలని గతేడాది ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.