Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలవంతంగా విలీనపు ప్రతిపాదనలు..
- మేటి వాటితో బలహీన బ్యాంకుల మెర్జర్
- బాస్లతో చర్చించకుండానే నిర్ణయాలు
- ఎదిరించలేక సరేనంటున్న బ్యాంకులు..
- ఇప్పటికే విఫలమైన ఎస్బీఐ విలీనం!
- తాజా ఆలోచన విఫలమే: విశ్లేషకులు
- వ్యతిరేకిస్తామంటున్న ఉద్యోగ సంఘాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) దెబ్బకు కునారిల్లుతున్న దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను ఆదుకొనేందుకు సర్కారు తీసుకుంటున్న చర్యలు ఆందళనకరంగా కనిస్తున్నాయి. మూలధన సమస్యను ఎదుర్కొంటున్న బ్యాంకులను తగు విధంగా నిధులు అందజేసి పరిపాలన సంస్కరణలతో వాటిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం.. కొత్తగా ఇప్పుడు బ్యాంకుల విలీనాల్ని నెత్తికెత్తుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికవేత్తలు వద్దంటున్నా.. బ్యాంకులకు ఇష్టం లేకపోయినా.. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా.. సర్కారు బలవంతంగా బ్యాంకుల విలీనాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా సోమవారం వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనపు ప్రతిపాదన కూడా పూర్తిగా సర్కారు బలవంతం పైనే తెరపైకి వచ్చినట్టుగా స్పష్టమవుతోంది. విలీనపు ప్రతిపాదనను ముందుగానే నిర్ణయించుకున్న సర్కారు సోమవారం ఉదయం ఆ మూడు బ్యాంకుల అధినేతలను అసలు విషయం చెప్పకుండానే నార్త్బ్లాక్కు (ఆర్థిక శాఖ కార్యాలయం) రప్పించుకొని.. విలీనపు ప్రతిపాదనను వివరించినట్టుగా సమాచారం. విలీనం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేయకుండానే.. తమ నిర్ణయం తెలుసుకోకుండానే సర్కారు నేరుగా విలీనపు నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా ఈ సమావేశంలో పాల్గొన్న ఒక బ్యాంక్ అధికారి తెలిపారు. సర్కారు ప్రతిపాదన తమకు అస్సలు ఇష్టం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే కదా..! అంటూ సదరు అధికారి తన అసహాయతను అనంతరం విలేకరులకు వెల్లడించారు. ఈ సన్నివేశాన్ని బట్టి చూస్తే నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ ఆధికారులే ఏయే బ్యాంకులను.. ఏయే బ్యాంకులతో విలీనం చేయాలన్న అంశాన్ని నిర్ణయించేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి ఆశాస్త్రియంగా ఈ విలీనపు ప్రతిపాదనలుంటున్నాయని ఆర్థికవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. సర్కారు తాజా ప్రతిపాదనతో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల సంఖ్య ప్రస్తుతం ఉన్న 21 నుంచి 19కి పడిపోనుంది. అంతర్జాతీయ స్థాయిలో నిలిచేలా దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి.. భారత్లో కేవలం 6-7 పెద్ద బ్యాంకులను మాత్రమే ఉంటే బాగుంటుందని స ఓర్కారు గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తోంది. తాజాగా మూడు బ్యాంకుల విలీనం కూడా ఇందులో భాగంగా చేపట్టిన చర్యేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విలీనాన్ని అడ్డుకుంటామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
పూర్తిగా వ్యతిరేకించిన రాజన్..
బ్యాంకుల విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం తెరపైకి తెస్తున్న తొలినాళ్లలోనే అప్పటి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వాటిని పూర్తిగా వ్యతిరేకించారు. విలీనపు ఆలోచన వాస్తవంగా బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనాన్ని సమకూర్చుతుందో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన అప్పట్లోనే కోరారు. బ్యాంకుల విలీనాన్ని అశాస్త్రియ ఆలోచనగా అభివర్ణించారు.
స్టేట్ బ్యాంక్ విలీనం అట్టర్ ఫ్లాప్..!
ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త రఘురామ్ రాజన్తో పాటు పలువురు ఆర్థిక విశ్లేషకులు బ్యాంక్ల ఏకీకరణను బాహాటంగా వ్యతిరేకించినా ప్రభుత్వం మాత్రం తన పంతం వీడడంలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) అయిదు అనుబంధ బ్యాంకులు, మహిళా బ్యాంక్ విలీనం చేపట్టింది. తాము దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంది. అయితే వాస్తవాలను చూస్తే స్టేట్ బ్యాంక్ విలీనం ప్రస్త్తుతానికి ఒక విఫల ప్రయత్నంగానే మిగిలి ఉంది. అంతకు ముందు ఎప్పుడు నష్టాలంటే తెలవని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన 200 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా విలీనం తరువాత నష్టాల్లోకి జారుకుంది. ఎన్పీఏల భారం మరింతగా పెరగడంతో బ్యాంక్ ఇప్పట్లో కోలుకొని పూర్వ వైభవాన్ని అందుకొనే అవకాశాలే కనిపించడం లేదు. అనుబంధ శాఖలకు చెందిన చాలా బ్యాంకు శాఖలు మూతబడ్డాయి. సిబ్బంది హేతబద్దీకరణలో భాగంగా ఉద్యోగులు పలు అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు అందించే ప్రతిఫలాల్లోనూ ఎస్బీఐ వివక్ష చూపుతోంది. అనుబంధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులను ఒక తీరుగాను... సొంత బ్యాంక్ ఉద్యోగులను మరో తీరుగాను చూస్తోందన్న ఆరోపణలున్నాయి.