Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వైలకూ వర్తింపు
న్యూఢిల్లీ: గత కొన్ని త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పొదువు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా డిపాజిట్దారులకు తీప ికబురు అందించింది. బ్యాంకుల్లో డిపాజిట్ రేట్లు పెరగడంతో చిన్న మొత్తాలపై కూడా వడ్డీ పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జాతీయ పొదుపు సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), పోస్టు ఆఫీసు డిపాజిట్ లాంటి చిన్న మొత్తాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటును 0.4శాతం వరకూ పెంచింది. 2018-19 అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగియనున్న మూడో త్రైమాసికానికి గాను ఈ వడ్డీ రేట్లను వర్తింపజేయనున్నారు. చిన్న తరహా పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తూ నోటిఫై చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా చిన్న మొత్తాల డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్ల నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ సెప్టెంబర్ 19న ఆర్ధిక మంత్రిత్వ శాఖ సర్యూలర్ను జారీ చేసింది. తాజా పెంపుతో ఐదేళ్ల కాలపరిమితితో చేసిన డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్ డిపాజిట్పై 7.3శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్పై 8.7 శాతం వడ్డీరేటు అమల్లోకి రానుంది. పోస్టు ఆఫీసుల్లోని సేవింగ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న 4 శాతం వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం పీపీఎఫ్, ఎన్ఎస్సీపై 7.6 శాతంగా ఉన్న వడ్డీరేటును 8 శాతానికి, కిసాన్ వికాస పత్రంపై వడ్డీని 7.3 శాతం నుంచి 7.7 శాతానికి చేర్చింది. బాలికల కోసం ఉద్దేశించిన సుకన్య సమద్ధి యోజన ఖాతాలపై వడ్డీ రేటును 0.4 శాతం పెంచి 8.5గా నిర్ణయించింది. క్రితం రెండు ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రేపోరేటును 50 బేసిస్ పాయింట్లు మేర పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.