Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తంగా ఆవిరైన 2018 ఏడాది 'ప్రాఫిట్స్'
- జనవరి నుంచి వచ్చిన లాభాలన్నీ ఉఫ్
- నెగటివ్ జోన్లోకి చేరిన బీఎస్సీ సెన్సెక్స్..
- పాలపొంగులా చప్పబడిన మార్కెట్ల జోరు!
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
'పెరుగుట.. విరుగుట కొరకే..' అనే నానుడిని నిజం చేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు చుక్కలను చూపిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ అనుకూలతల నడుమ 2018 జనవరి నుంచి అనూహ్యంగా పాలపొంగులా పెరుగుతూ జీవిత కాల గరిష్టాలను నమోదు చేస్తూ వచ్చిన స్టాక్ మార్కెట్లు గురువారం నాటికి తన జోష్ను ముగిస్తూ.. నెగటివ్ జోన్లోకి జారుకున్నాయి. మార్కెట్లు గత ఎనమిదిన్నర నెలల కాలంలో పెరిగిన మదుపరుల సంపద సెప్టెంబరు మాసంతో పాటు.. గత పది రోజులుగా నమోదవుతున్న భారీ నష్టాలకు మొత్తంగా ఊడ్చిపెట్టుకుపోయినట్టుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలించి చూస్తే మార్కెట్లో ఎక్కువగా చిన్న మదుపరులే నష్టపోవడం కనిపిస్తోంది. స్వల్పకాల లాభాలను ఆశిస్తూ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొత్త మదుపరుల అడ్రస్ అయితే పూర్తిగా గల్లంతైనట్టే కనిపిస్తోంది. తాము ఇన్వెష్ట్ చేసిన సొమ్మంతా కళ్లముందే అంకెల రూపంలో కరిగిపోతుంటే కంటతడి పెడుతూ.. మార్కెట్లకు నమస్కారం చేసిన సంఘటనల గత నెల రోజులూగా స్టాక్ మార్కెట్లలో సర్వసాధారణంగా కనిపించాయి.
లాభం.. నష్టం సరిపోయింది..
2018 జనవరి ప్రారంభం రోజున బీఎస్ఈ సెన్సెక్స్ 34,117 పాయింట్ల వద్ద నిలబడింది. అక్కడి నుంచి తమ పరుగును మొదలు పెట్టి కేవలం30 రోజుల వ్యవధిలోనే బీఎస్ఈ సూచీ రికార్డు స్థాయిలో 36,991 పాయింట్లకు చేరుకుంది. తరువాత కాస్త కుంగుతూ వచ్చినా మార్చి 23వ నాటికి మళ్లీ 32649 పాయింట్ల స్థాయికి జారింది. అయితే గోడకు కొట్టిన బంతిలా.. మార్చి నెలాఖరు నుంచి ఎగిసిపడుతూ వచ్చిన బీఎస్ఈ సెన్సెక్స్ ఆగస్టు 28 నాటికి 38,989 పాయింట్ల జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అక్కడి నుంచి క్రమంగా దిగజారుతూ వచ్చిన మార్కెట్లు సెప్టెంబరులో భారీగా పతనమయ్యాయి. అక్టోబరు ప్రారంభం నుంచి మార్కెట్లకు దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తోంది. దీంతో గురువారం నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ జనవరి ప్రారంభంలో ఉన్న 34,117 పాయింట్ల స్థాయికి కూడా దాటి దిగువకు పడిపోయింది. గురువారం 759.74 పాయింట్ల నష్టంతో 34,001.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఈక్రమంలో ఇప్పటి వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోయినట్టుగా మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ భారీ పతనంలో బడా బాబులతో మొదలుకొని సామాన్య మదుపరి వరకు ప్రతీ ఒక్కరూ నష్టాలతో చేతులు కాల్చుకొన్నవారేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టిన వారు.. తెలివిగా షార్ట్కవరింగ్తో నష్టాలను పూడ్చుకున్నవారు కొంత మేర నష్టాల నుంచి బయటపడినట్టేనని వారు విశ్లేషిస్తున్నారు.
ఒకే రోజు 7.5 లక్షల కోట్ల నష్టం!
లండన్: అనూహ్యంగా గురువారం ప్రపంచ మార్కెట్లలో నమోదైన పతనంలో సామాన్యులతో పాటు సంపన్నులు కూడా భారీగానే నష్టపోయారు. స్టాక్ మార్కెట్లలో అలజడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తొలి 500 మంది సంపన్నులు అక్షరాలా రూ.7.3లక్షల కోట్ల మేర తమ సంపదను కోల్పోయారు. వీరందరిలోకి అత్యధికంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్బెజోస్ ఒక్కరే రూ.66 వేల కోట్లకు పైగా సంపదను కోల్పోయినట్టుగా బ్లూమ్బర్గ్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తగా ఉన్న 500 మంది సంపన్నులలోకి బెజోస్ ఎక్కువగా నష్టాన్ని మూటగట్టుకున్నట్టుగా వివరించింది. ఇక ఐరోపాకు చెందిన బిలియనీరు బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద రూ.33వేల కోట్లు ఆవిరైంది. ఆయన ఈ ఏడాదిలో పెంచుకున్న విలువలో సగం ఒక్క రోజులోనే కోల్పోయారు. చైనా సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేసిందనే వార్తలు రావడంతో ఆయన ఎల్వీఎంహెచ్ షేర్లు పతనమయ్యాయి. ఇక బెర్క్షైర్ హత్వే అధినేత వారన్ బఫెట్ సంపద కూడా దాదాపు రూ.33 వేలకోట్లు తగ్గింది.