Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నగదు కొరతను ఎదుర్కొంటున్న దేశీయ 'బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ'లకు (ఎన్బీఎఫ్సీ) ఊరటనిచ్చే లా శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పెద్ద వెసులుబాటు ప్రకటన చేసింది. చెల్లింపుల విషయంలో విఫలమైన ఐఎల్అండ్ఎఫ్ఎస్ దెబ్బతో ఎన్బీఎఫ్సీ సంస్థల ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు నెలకొంటున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఎన్బీఎఫ్సీలకు మద్దతు అందించడానికి నగదు నిధుల పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు అయినా ఎన్బీఎఫ్˜సీల్లో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న మూలధన పెట్టుబడులను 15 శాతం వరకు పెంచుకొనేందుకు అనుమతినిచ్చింది. ఈ నిబంధనలు 2018 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్యాంకింగేతర సంస్థలకు ఆర్థిక ఊరట లభించనుంది. అయితే తాజా ఆర్బీఐ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై మదుపర్లలో కొత్త ఆందోళనలను పెంచింది.
ఆర్థికంలో తీవ్ర ఒడిదొడుకులు..
నిరాటంకంగా పెరుగుతోన్న చమురు ధరలు పెరుగుతుండడం, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మార్కెట్లలో అనిశ్చితి, ఖరీఫ్ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల పెంపు తదితరాల కారణంగా ఆర్థిక లక్ష్యాలను అందుకోవడంలో అవాంతరం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల కాలానికి దేశంలో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచాలని అభిప్రాయపడినట్టుగా ఇటీవల జరిగిన ఆర్బీఐ-ఎంపీసీ సమావేశం మినెట్స్ వెల్లడించాయి. ఐదుగురు సభ్యులతో కూడిన ఎంపీసీలో కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే వడ్డీరేట్లను పెంచాలని కోరినట్టుగా ఈ మినెట్స్ ద్వారా తెలుస్తోంది.