Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖజానాకు పన్ను ఆదాయంపెంచని 'ఓసీఎం'
- ట్యాక్స్ 'నెట్'లోకి కొత్తగా చేరింది 1.5 లక్షల మందే!
న్యూఢిల్లీ: భారీ అంచానాలతో మోడీ సర్కారు 2016లో చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ (ఆపరేషన్ క్లీన్ మనీ- ఓసీఎం) అన్ని విధాలా తుస్సుమన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. రద్దు చేసిన నోట్లలో కేవలం స్వల్ప మొత్తంలోనే తిరిగి వ్యవస్థలోకి రాలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించగా.. దొంగనోట్లను అడ్డుకోవడంలో పెద్దనోట్ల రద్దు ఏమాత్రం ప్రభావం చేపలేదని నిఘా వర్గాలు ఇప్పటికే తేల్చేశాయి. అయితే పెద్దనోట్ల రద్దు వల్ల పన్ను రాబడి విఫరీతంగా పెరిగి ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందన్న సర్కారు అంచనాలు కూడా తుస్సుమన్నట్టు తాజాగా తెలుస్తోంది. నోట్లరద్దు తరువాత ఆదాయపు పన్ను రిటర్నుల్లో పెరుగుదలను గురించి తెలుసుకునేందుకు గాను 'ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్' దినపత్రిక ఆదాయపు పన్ను శాఖకు (ఐటీ) దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం అర్జీలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో బ్యాంకుల్లో ఇతర ఆర్థిక సంస్థల్లో దాదాపు 23.5 లక్షల మంది అనుమానాస్పద డిపాజిట్లు జరిపినట్టుగా ఐటీ శాఖ గుర్తించింది. వీరికి నోటీసులను కూడా పంపింది. అయితే ఇందులో 11.8 లక్షల మంది ఐటీ శాఖ నోటీసులకు తమదైన రీతిలో వివరణలిచ్చారు. మరోవైపు నోట్లరద్దు సమయంలో గుర్తించిన ఆరు లక్షల మంది పాన్కార్డు హోల్డర్లు ఇప్పటి వరకు ఎలాంటి పన్ను రిటర్నులను దాఖలు చేయలేదని తేలింది. అనుమానాస్పదంగా గుర్తించిన 23.5 లక్షల మందిలో.. కేవలం 1.5 లక్షల మంది మాత్రమే కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నట్టుగా ఐటీ శాఖ లెక్క తేల్చింది. అంటే మొత్తం అనుమానాస్పద డిపాజిట్ దారుల్లో కేవలం 6.3 శాతం మంది మాత్రమే కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
సర్కారు అంకెల్లో భారీగా వ్యత్యాసం..
సమాచార చట్టం కింద ఐటీ శాఖ వెల్లడించిన డేటాకు.. ఇటీవల ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ శుక్లా పార్లమెంట్కు వెల్లడించిన సమాచారానికి భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఆగస్టు నెలలో శుక్లా రాజ్యసభలో ఇదే విషయమై ఒక ప్రకటన చేస్తూ పాన్ కార్డు ఉన్న వారిలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి సం ఖ్యను 2.1 లక్షల మందిగా గుర్తించినట్టుగా మంత్రి తెలిపారు. ఇదే సమ యంలో వీలు రూ.6,410 కోట్ల మేర సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్ కట్టిన ట్టుగా సంస్థ తెలిపింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి సంస్కరణల మూలం గా పన్ను-జీడీపీ నిష్పత్తిలో స్వల్ప మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. మోడీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీ (ఓసీఎం) పన్ను ఎగవేత దారులను పట్టుకొనే విషయంలో విఫలమైందన్నదని కాదనలేని సత్యం. పెద్దనోట్ల రద్దు సందర్భంగా ఐటీ శాఖ, విచారణ సంస్థలు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు రూ.900 కోట్ల మేర నగదును సీజ్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం ఇప్పట్లో వెల్లడించింది. ఇందులో దాదాపు రూ.636 కోట్లు నగదున్నట్టుగా అప్పట్లోనే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో 8,239 సర్వేల్లో రూ.6,745 కోట్ల విలువైన అప్రకటిత సొమ్ము వెలుగులోకి వచ్చినట్టుగా సర్కారు తెలిపింది. అయితే ఇవ్వన్ని ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు సమయంలో పెట్టుకున్న లక్ష్యాలతో పోలిస్తే.. చాలా స్వల్పం. నోట్ల రద్దు మూలంగా లక్షల కోట్లలో నల్లధనం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కేవలం వందల కోట్లలో మాత్రమే అప్రకటిత సొమ్ము వెలుగులోకి రావడంతో ఓసీఎం పూర్తిగా అనాలోచిత, విఫల చర్య అన్ని చెప్పక తప్పదు.