Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు 'టాటా' చెప్పారు..
- సంస్థ ప్రయోజనాలే లక్ష్యంగా బోర్డు నిర్ణయం..
- అప్రమత్తతతో ముందుకు సాగిన టాటా సన్స్
- ప్రభుత్వం రుణ భారం తగ్గిస్తే పునరాలోచనట..
- చాణక్యం ప్రదర్శించిన చైర్మెన్ ఎన్.చంద్రశేఖరన్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో ప్రధాన విమానయాన సంస్థగా సేవలందిస్తోన్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలు విషయంలో టాటా సన్స్ బోర్డు శుక్రవారం వెనుకడుగు వేసింది. బోర్డు నిర్ణయం వెనుక ప్రధానంగా ఆ సంస్థ చైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్ చాణక్యం దాగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక భారంతో నిర్వహణ కష్టతరంగా మారి మూతబడే స్థాయికి చేరుకున్న జెట్ ఎయిర్వేస్ను ఆదుకోవాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా టాటా సంస్థల సహాయం కోరినట్టు సమాచారం. అయితే చంద్రశేఖరన్ మాత్రం ప్రధాని అభ్యర్థనను పక్కన బెట్టి తమ సంస్థ ప్రయోజనాలే ప్రధానం అన్నట్టుగా వ్యవహిరంచినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణాలూ లేకపోలేదు. టాటా సంస్థ దేశంలోనే చాలా పెద్ద కార్పొరేట్ సంస్థ. బహుముఖంగా విస్తరించి దేశ ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ.. లాభమే పరమావధిగా పని చేస్తూ వస్తోంది. అయితే దేశంలోనే పెద్ద సంస్ధగా ఉన్న టాటాలకు జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టాలంటూ అభ్యర్థన వచ్చింది. ఈ అభ్యర్థిన మేరకు జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే అంశాన్ని టాటా సన్స్ పరిశీలనకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా టాటా సన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థతో ప్రాథమికంగా చర్చలు జరిపింది. శుక్రవారం ఈ చర్చల ఫలితాలపై టాటా సన్స్ సంస్థ బోర్డు ప్రధాన సమాలోచనలు జరిపింది. ఈ సమావేశంలో చంద్రశేఖరన్ జెట్ కొనుగోలును సూత్రప్రాయంగా వ్యతిరేకించినట్టుగా సమాచారం. జెట్ ఎయిర్వేస్ సంస్థలో భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ వ్యవహరిస్తోంది. భారత విమానయన సంస్థ వల్ల తాము నష్టాలను భరించాల్సి వస్తోందని ఎతిహాద్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేస..ి ఎతిహాద్ మాదిరిగా కష్టాల్లోకి జారుకోవడం చంద్రశేఖరన్కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. ఇప్పటికే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ వందల కోట్ల రూపాయల బకాయిలను కలిగి ఉంది. ప్రస్తుత తరుణంలో జెట్ను కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని టాటా సంస్థలు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కొన్ని బాకీలను రద్దు చేసుకుంటే సంస్థకు మేలు జరుగుతుందన్న ఆలోచన కూడా బోర్డు సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం పెరిగిన విమాన ఇంధన ధరలు, తగ్గుతున్న రూపాయి విలువ నేపథ్యంలో విమాన సర్వీసులను నడపడం అన్ని సంస్థలకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయం ఇప్పటికే విస్తార, ఎయిర్ ఏషియా విమాన సర్వీసులను నడుపుతోన్న టాటా సన్స్ సంస్థకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత తరుణంలో జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయడం సబబు కాదన్న అభిప్రాయానికి బోర్డు వచ్చినట్టుగా సమాచారం. జెట్ రుణాలను మాఫీ చేయడం.. సబ్సిడీలతో పాటు మరికొన్ని తాయిలాలను ప్రకటిస్తే జెట్ కొనుగోలు విషయంలో ఒక ప్రతిపాదనతో ముందుకు సాగాలని టాటా సన్స్ నిర్ణయించినట్టుగా సమాచాం. ఈ మెగా అభిప్రాయం వెనుక చంద్రశేఖరన్ దూర దృష్టి ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.