Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19.1 బిలియన్ డాలర్లకు చేరిన సీఏడీ
- 5000 కోట్ల డాలర్లకు వాణిజ్యలోటు: ఆర్బీఐ
న్యూఢిల్లీ: పెరిగిన చమురు ధరల కారణంగా దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) నాలుగేండ్ల గరిష్టానికి చేరినట్టుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో దేశ కరెంటు ఖాతా లోటు జీడీపీలో 2.9 శాతానికి (19.1 బిలియన్ డాలర్లకు) చేరినట్టుగా ఆర్బీఐ తాజా గణాంకాల్లో వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో లోటు జీడీపీలో 1.1 శాతంగా (6.9 బిలియన్ డాలర్లుగా) ఉన్నట్టుగా ఈ గణాంకాలు తెలిపాయి. 2013 ఏప్రిల్-జూన్ తరువాత కరెంటు ఖాతా లోటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.సెప్టెంబరు త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు గరిష్టానికి చేరినప్పటికీ.. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో రానున్న రోజుల్లో ఇది కాస్త మెరుగైన స్థితికి చేరుకోవచ్చని ఆర్బీఐ అభిప్రాయపడింది. అయితే క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువతో ప్రమాదం పొంచి ఉందని పెద్దబ్యాంక్ హెచ్చరించింది. 2018లోని మొదటి తొమ్మిది నెలల కాలంలో రూపాయి దాదాపు 14 శాతం మేర కుంగింది. అయితే చమురు ధరలు శాంతించడంతో అక్టోబరు 5.6 శాతం మేర పుంజుకుంది. ప్రస్తుత మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ కరెంటు ఖాతాలో లోటు 2.9 శాతం నుంచి 2.3 శాతానికే పరిమితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి చెల్లింపుల లోటు 12 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఆర్బీఐ తేల్చింది. అక్టోబరు ప్రారంభం నుంచి భేరీజు వేసి చూస్తూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 30 శాతం వరకు దిగివచ్చాయి. అయితే చమురు ఉత్పత్తి దేశాల నుంచి ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం లేకపోలేదని ఆర్బీఐ అంచనా కట్టింది.
మరింత పెరిగిన వాణిజ్య లోటు..
సెప్టెంబరు త్రైమాసికానికి భారత వాణిజ్య లోటు 5000 కోట్ల డాలర్లకు చేరుకున్నట్టుగా దేశ పెద్ద బ్యాంక్ ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 32.5 బిలియన్ డాలర్ల దరిదాపుల్లో ఉన్నట్టుగా బ్యాంక్ తెలిపింది. ఇదే కాలంలో భారత్ వాణిజ్య చెల్లింపుల బకాయిలు 190 కోట్ల డాలర్ల దరిదాపుల్లో ఉన్నట్టుగా ఆర్బీఐ గణాంకాలు అధికారికంగా వెల్లడించాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో దేశం వాణిజ్య బకాయిల స్థానంలో 9.5 బిలియన్ డాలర్ల చెల్లింపులు రావాల్సిన స్థితిలో ఉందని బ్యాంక్ తెలిపింది. దేశంలోని మిగత సూక్ష్య ఆర్థిక గణాంకాలను రూపాయి గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్కారు ఈ దిశగా చర్యలు ప్రారంభిస్తే మంచిదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్గా చెప్పబడుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో సర్కారు అప్రమత్తంగా అడుగులు వేస్తుందని వారు చెబుతున్నారు.