Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రుణ లభ్యత పెంపు, లిక్విడిటీ దన్ను కోరాం
- భిన్నాభిప్రాయలపై పెద్దబ్యాంక్తో చర్చించాం
- చర్చిస్తే... ఆ వ్యవస్థను నాశనం చేసినట్టేనా..!
- బాధ్యతల్ని, ఇబ్బందుల్ని తెలియజేసే యత్నం చేశాం..
- ఆర్బీఐ అధికారాలను మా ప్రభుత్వం లాక్కోలేదు.. : ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడిన సంగతిని మోడీ సర్కారు ఎట్టకేలకు బాహాటంగా ఒప్పుకుంది. స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ పనితీరుకు సంబంధించి తమకు రెండు మూడు అంశాల్లో భేదాబిప్రాలున్నాయని వెల్లడించారు. ఈ అంశాలకు సంబంధించి తాము లోతుగా చర్చలు జరిపామని ఆయన తెలిపారు. లోతుగా చర్చలు జరపడం.. ఆర్బీఐ వ్యవస్థను నాశనం చేయడం ఎలా అవుతుందని ఆయన తమ ప్రభుత్వ విమర్శకులను ప్రశ్నించారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై రేగుతున్న రాజకీయ దుమారానికి జైట్లీ తనదైన రీతిలో వివరణనిచ్చారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు, ప్రధానులుగా పని చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు తమ హయాంలో ఆర్బీఐ గవర్నర్లు రాజీనామాలు చేసేలా.. చేపట్టిన అనూహ్య చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'టైమ్స్ నెట్వర్క్స్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్'లో ఆయన మాట్లాడుతూ వ్యవస్థలో రుణ లభ్యత పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన లిక్విడిటీ దన్నును కల్పించాలన్న అంశాలపై ఆర్బీతో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడినట్టుగా జైట్లీ వెల్లడించారు. ఈ అంశాలపై తమ ఆందోళనను వెల్లడించేందుకు గాను ప్రభుత్వం ఆర్బీఐతో చర్చలను ప్రారంభించిందని తెలిపారు. ఈ అంశాలు కూడా ఆర్బీఐ విధుల్లో భాగమే అయినందున వీటిపై దృష్టి సారించాలని పెద్ద బ్యాంక్ను కోరామని ఆయన తెలిపారు. స్వయంప్రతిపత్తి, స్వతంత్రత కలిగిన ఆర్బీఐ లాంటి సంస్థతో చర్చలు జరపడం ఆ వ్యవస్థను నాశనం చేయడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అయితే ఆర్బీఐ పనితీరును ప్రశ్నించే క్రమంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-7ను వినియోగించిందన్న అంశంపై జైట్లీ స్పష్టతనివ్వలేదు.
లోపాల్ని తెలియజేసే ప్రయత్నం చేశాం..
తాము సార్వభౌమాధికారం కలిగిన ప్రభుత్వమని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు సంబంధించి సర్కారు, ఆర్బీఐలు ముఖ్యమైన వాటాదారులని ఆయన అన్నారు. ఆర్బీఐ చేయాల్సిన పనులను తాము చేజిక్కించుకోవడం లేదని.. కాకుంటే క్రెడిట్, లిక్విడిటీలు ఆర్బీఐ భాద్యతేనని గుర్తు చేస్తున్నామన్నారు. ఎకొన్ని సమయాల్లో వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలకు ఇబ్బందులను గురించి తెలియపరుస్తూ.. లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా కోరాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వ్యవస్థలోని ఇబ్బందులను గురించి ప్రభుత్వం తెలియజేయకపోతే.. సర్కారు తన కర్తవ్య నిర్వహణలో విఫలమవుతుందని అన్నారు. ప్రభత్వ విధానాలతో ఆర్బీఐ విధానాలు సమకాలీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.