Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) అతి పెద్ద బ్యాంకింగ్ మోసం వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ బ్యాంక్పై ప్రత్యక్ష చర్యలను మొదలు పెట్టింది. బ్యాంక్కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంజీవ్ శరణ్, కె.వీర బ్రహ్మాజీ రావులను విధుల నుంచి తొలగించింది. నేషనల్ బ్యాంక్స్ స్కీం 1970 కింద ఒక జాతీయ బ్యాంక్కు చెందిన ఇద్దరు డైరెక్టర్లను తొలగించడం ఇదే తొలిసారి. 2018 జులైలో శరణ్, బ్రహ్మాజీలకు సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బ్రాడీ హౌస్ బ్రాంచ్లో స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని నోటీస్లో పేర్కొంది. వారి వివరణలు పరిశీలించాక బ్యాంక్ బోర్డు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని సర్కారు వారిని తొలగించింది. ప్రభుత్వ చర్యను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్వాగతించింది. ఆ సంఘ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ ''మేము కేంద్ర ప్రభుత్వ చర్యను స్వాగతిస్తున్నాం. అత్యున్నత నిర్వహణ బృందానికి తెలియకుండా ఇంత భారీ స్థాయిలో మోసం జరగడానికి అవకాశం లేదు. ప్రభుత్వం కూడా వారి వాదనలు విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకొంది'' అని ఆయన పేర్కొన్నారు.