Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న దేశంలోని రెండో అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు గాను ఆ సంస్థ ప్రముఖ ప్రమోటర్ నరేశ్ గోయెల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే ఆ సంస్థ బోర్డు నుంచి వైదొగేందుకు కూడా నరేశ్ గోయెల్ సముఖంగా ఉన్నట్టుగా జెట్ పునర్నిర్మాణ ప్రక్రియతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. తగిన ధరతో జెట్ మరో ప్రమోటర్ సంస్థ ఎతిహాద్ తన వాటాను కొనుగోలు చేసుందుకు ముందుకు వస్తే.. సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగేందుకు ఆయన సుముఖంగానే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత వారం జెట్ రుణదాతల బృందానికి సారథ్యం వహిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్తో ఎతిహాద్ చర్చలు జరుపుతూ ఒక్కో షేరుకు రూ.150ల చొప్పున వెచ్చించి అదనపు వాటాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గోయెల్ సంస్థపై తన పట్టును కొనసాగించేందుకు.. లేదా ఎక్కువ మొత్తానికి తన వాటాను విక్రయించేందుకు గాను మొండిగా ప్రవర్తించడం లేదని.. అయితే తన వాటా విక్రయానికి గరిష్ట ధర వచ్చేంత వరకని ఆయన వేచి చూస్తున్నట్టుగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. గరిష్ట విలువను ఆర్జించేందుకు గాను ఆయన ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్టుగా ఆ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ టేక్వర్ కారణంగా మేనేజ్మెంట్లో మార్పు వస్తే మాత్రం కొత్త విక్రేత సాధారణ ప్రజానికానికి 25% వాటా కొనుగోలు నిమిత్తం ఓపెన్ ఆఫర్ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే సెబీ నిబంధనల మేరకు ఒపెన్ ఆఫర్ నిమిత్తం నాలుగు విభిన్న పారమతులను పాటించాల్సి ఉంటుంది. వీటి ప్రకారం చూస్తే ఎతిహాద్ సంస్థ ప్రకటించిన ధర కంటే ఎక్కువగానే చెల్లించి వాటాను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జెట్లో వాటా కొనుగోలును ఎతిహాద్ సంస్థ భారంగానే పరిగణించే అవకాశం కనిపిస్తోంది. జెట్ స్టాక్ ధర గడిచిన 52 వారాల్లో రూ.163 నుంచి రూ.830 మధ్య పలికింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి షేరు ఒక్కింటి ధర రూ.276గా నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఎతిహాద్ సమ్మతించిన రూ.150 ధర అంత ఆకర్షిణీయంగా కనిపించడం లేద సరికదా సెబీ టేక్ ఓవర్ కోడ్ దీనికి సమ్మతించదు. ఈ నేపథ్యంలో సెబీ అనుమతి లభించడం కష్టమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్పైస్జెట్ కొనుగోలు సమయంలో సెబీ కోడ్ను పక్కనబెట్టి టేక్ ఓవర్ నిబంధనలకు సంబంధించి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రమోటర్ అజరు సింగ్కు మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ విషయంలో సెబీ ఎలా వ్యవహరిస్తుందన్నది వేచి చూడాలి. దీనికి తోడు షేరు ఒక్కింటికి రూ.150 చొప్పున జెట్లో కలీక వాటా విలువను (డాలరుకు రూ.72ల చొప్పున)రూ.1800 కోట్లుగా ఎతిహాద్ నిర్ణయించింది. కానీ జెట్ రుణదాతలు మాత్రం జెట్ విలువను అంతకంటే ఎక్కువగా లెక్కగట్టి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో పీటముడి పడినట్టుగా తెలుస్తోంది