Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ నుంచి తగ్గిన ఎగుమతులు
- ఏప్రిల్-జనవరి కాలంలో ఇంపోర్ట్స్ అధికం
న్యూఢిల్లీ : భారత్ నుంచి శుద్ధి చేసిన ఉక్కు ఎగుమతులు గణనీయంగా పడిపోతున్నాయి. మరోవైపు దిగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతులు, దిగుమతుల్లో నికరంగా చూస్తే భారత్.. శుద్ధి చేసిన ఉక్కు దిగుమతిదారుగా మారినట్టు జాయింట్ ప్లాంట్ కమిటీ(జేపీసీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జనవరి కాలంలో 5.15 మిలియన్ టన్ను(ఎంటీ)ల శుద్ధి ఉక్కు ఎగుమతి చేయగా, 6.55 ఎంటీల శుద్ధి ఉక్కును దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలో 8.22 ఎంటీల శుద్ధి ఉక్కును భారత్ ఎగుమతి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19)లో సూచించిన కాలవ్యవధి (ఏప్రిల్-జనవరి)లో 5.15 ఎంటీల శుద్ధి చేసిన ఉక్కును ఎగుమతి చేసింది. దాదాపు 37.3 శాతం మేరకు ఎగుమతులు క్షీణించాయి. శుద్ధి ఉక్కు ఎగుమతులు క్షీణించగా, దిగుమతులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలోని దిగుమతులు(6.45 ఎంటీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి కాలంలోని దిగుమ తుల(6.55 ఎంటీ)ను పోల్చితే 0.1శాతం పెరిగాయి. 2018-19లో మొత్తంగా చూస్తే భారత్ నికరంగా శుద్ధి చేసిన ఉక్కు దిగుమతిదారుగా మారిందని జేపీసీ వివరించింది. 2018 జనవరిలో దిగుమతులతో పోల్చితే 2019 జనవరిలో శుద్ధి ఉక్కు దిగుమతులు 79.2శాతం పెరిగిందని తెలిపింది. ఏప్రిల్-జనవరి కాల వ్యవధిలో గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉక్కు ఉత్పత్తి 4.4 శాతం(109.18ఎంటీ) పెరిగినట్టు పేర్కొంది. అలాగే దేశంలో ఈ ఉక్కు వినిమయం 7.8శాతం(79.96 ఎంటీ) హెచ్చిందని వివరించింది.