Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.45వేల కోట్ల రుణ సంక్షోభంలో అనిల్ అంబానీ సంస్థ
- జాతీయ ట్రిబ్యునల్ వద్ద దివాలా పిటిషన్
- రుణ పరిష్కార నిపుణుల ఏర్పాటుపై ఎస్బీఐ దృష్టి
- ఆర్కామ్కు రుణాలిచ్చిన 40 సంస్థల్లో ఎస్బీఐ ఒకటి
ముంబయి : భారీ రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీ సంస్థ 'రిలయెన్స్ కమ్యూనికేషన్స్' కొద్ది రోజుల క్రితం దివాలా ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.45వేల కోట్ల రుణ ఊబిలో చిక్కుకున్న ఈ సంస్థకు వేలకోట్లు రుణాలు ఇచ్చి చేతులు కాల్చుకున్న సంస్థల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). దీంతో ఆర్కామ్ దివాలా కేసు విషయంలో రుణ పరిష్కారంపై ఎస్బీఐ ప్రఖ్యాత నాలుగు ఆడిటింగ్ సంస్థల్ని, కన్సెల్టెంట్స్ను సంప్రదించింది. వీరు ఇచ్చిన సలహాలు, సూచనలమేరకు 'రుణ పరిష్కార నిపుణుల్ని' (ఆర్పీ) ఏర్పాటుచేయడానికి ఎస్బీఐ సిద్ధమవుతోంది.
రూ.45వేల కోట్ల రుణాల చెల్లింపులో విఫలమయ్యామనీ, అనిల్ అంబానీ సంస్థ కొద్ది రోజుల క్రితం ముంబయిలోని 'నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్'ను ఆశ్రయించింది. కంపెనీ దివాలా తీసిందని ప్రకటించారు. ఈ దివాలా ప్రక్రియను పరిష్కరించుకోవటం కోసం ఎస్బీఐ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ట్రిబ్యునల్ వద్ద రుణ కమిటీ(ఆర్కామ్కు రుణాలిచ్చిన కంపెనీలు) ఆమోదించిన దివాలా పరిష్కారాన్ని అమలుజేయాల్సి ఉంటుంది. లేదా, ఎస్బీఐ ఏర్పాటుచేసిన 'ఆర్పీ' ద్వారా దివాళా కేసును పరిష్కరించుకోవాలి. ఈనెల 4న ఆర్కామ్ దివాలా ప్రకటన చేయటం స్టాక్మార్కెట్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. అనిల్ అంబానీ ఇతర వ్యాపార సంస్థల షేర్లన్నీ దెబ్బతిన్నాయి. రుణ దాతల కమిటీ(40కుపైగా సంస్థలున్నాయి) ఓకే అంటే ఆర్కామ్ దివాలా ప్రణాళికను చేపట్టటమో! లేదా..రుణ పరిష్కార నిపుణులతో దివాలా ప్రక్రియను పూర్తిచేయటమో! ఎస్బీఐ చేయాల్సి ఉంటుంది. ఆర్కామ్ దివాలా కేసు విషయమై ఎస్బీఐ అధికార ప్రతినిధిని ఒక జాతీయ మీడియా ప్రశ్నించగా, స్పందించడానికి నిరాకరించారు.
ఆ డబ్బు 'రాఫెల్'లో పెట్టుబడి పెట్టారు : ఎరిక్సన్ ఆరోపణ
- తమదగ్గర రూ.550 కోట్ల విలువైన టెలికామ్ పరికరాలు కొనుగోలు చేసిన ఆర్కామ్ ఆ మొత్తాన్ని చెల్లించలేదని స్వీడిష్ టెలికామ్ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టుకెక్కింది. తమకు ఇవ్వాల్సిన డబ్బును అనిల్ అంబానీ 'రాఫెల్' జెట్ డీల్లో పెట్టుబడి పెట్టారని ఎరిక్సన్ ఆరోపించింది. అయితే ఈకేసుపై సుప్రీంకోర్టు ముంగిట వాదనలు ముగిసాయి. తుది తీర్పు వెలువడాల్సి ఉంది.
- ఆర్కామ్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రిలయెన్స్ జియో-ఆర్కామ్ మధ్య ఒప్పందం విఫలం కావటంతో ఆర్కామ్ దివాలాకు వెళ్తోందని తెలిపారు.
- ముందస్తు బకాయిలతో ఉన్న సమస్యల నేపథ్యంలో ఆర్కామ్కు ఫిజికల్ గ్యారెంటీ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రిలయెన్స్ జియో కూడా చేతులెత్తేసింది. దీంతో అనిల్ అంబానీని అరెస్టు చేయాలనీ, దేశం విడిచి పారిపోకుండా నియంత్రించాలనీ ఎరిక్సన్ సుప్రీంకోర్టును కోరింది.
- తమకు చెల్లించాల్సిన రూ.550కోట్లు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారనీ, బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా అనిల్ అంబానీ హామీ ఇచ్చారనీ, గడువు తీరినా ఆయన స్పందించటం లేదనీ, కోర్టు గడువు కూడా ఉల్లంఘించారనీ పిటిషన్లో ఎరిక్సన్ ఆరోపణలు చేసింది.
- ఎరిక్సన్ ఇండియా తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇటీవల జరిగిన విచారణలో ఆయన మాట్లాడుతూ, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని రెండుమార్లు ఆర్కామ్ ఉల్లంఘించిందనీ, తప్పుడు సమాచారంతో కోర్టును నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు.