Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టబడులను ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం వేగం పెంచింది. తాజాగా దేశంలోని మూడు ఉక్కు కర్మాగారాల్లో ప్రభుత్వానికి ఉన్న 100శాతం వాటాను విక్రయించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రచించినట్టుగా సమాచారం. సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు చెందిన విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారం(కర్ణాటక), సేలం ఉక్కు కర్మాగారం (తమిళనాడు), అల్లారు ఉక్కు కర్మాగారం (పశ్చిమ బెంగాల్)లలో ప్రభుత్వం వాటాను విక్రయించనున్నట్టుగా సమాచారం. ఈ మూడు ఉక్కు కర్మాగారాలు వరుసగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. దీంతో వాటిని అమ్మటమే మంచి నిర్ణయమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మక ప్రక్రియ వేగంగా సాగేందుకు.. ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టెమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం)కు పనిని అప్పజెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే రెండు దశల్లో వేలం ప్రక్రియ ద్వారా వ్యూహత్మక కొనుగోలు దారులను ప్రభుత్వం గుర్తించనున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి నాటికి రూ.80,000 కోట్ల ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని వీలైనంత తొందరగా చేరుకునేందుకు గాను తాజాగా ప్రభుత్వం ఉక్కు కర్మాగారాల అమ్మక ప్రక్రియ తెర మీదకు తెచ్చినట్టుగా సమాచారం.