Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వొడాఫోన్ సీీఈవో తీవ్ర ఆరోపణ
ముంబయి: భారత్లో ప్రస్తుతం ఉన్న టెలికాం నిబంధనలు అసమానంగా ఉన్నాయని వొడా ఫోన్ సంస్థ సీఈవో నిక్రీడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ భారత్లో టెలికాం నిబంధనలు ఒకే విధంగా లేవంటూ బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ''మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం.. నిబంధనలు అనేవి అందరికీ ఒకే విధంగా ఉండాలి.. కానీ గత రెండేండ్లలో వచ్చిన కొత్త నిబంధనలు అన్నీ.. ఒక్క రిలయన్స్ జియో సంస్థకు తప్ప చాలా వరకు మార్కెట్లో ఉన్న సంస్థలకు వ్యతిరేకంగానే ఉన్నాయి'' అని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తాము కచ్చితంగా చెప్పగలమని పేర్కొన్నారు. నిబంధనలు అన్ని సంస్థలకు ఒకటేలా ఉండాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు. భారతీయ నియంత్రణ, విధానాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం తమ సంస్థ కష్టకాలంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్లో ఉన్న అతి తక్కువ మొబైల్ సర్వీసు రేట్లు ఏమాత్రం గిట్టుబాటుకావని నిక్ పేర్కొన్నారు. మార్కెట్లోని ప్రధాన మూడు టెలికాం సంస్థలు నగదు కొరతతో ఇబ్బంది పడుతున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్లో ధరలు చాలా తక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. భారత్లో నెలకు సగటున ఒక్క వాడకందారు డేటా వినియోగం 12 జీబీలుగా ఉందని పేర్కొన్నారు. ఇంత తక్కువ ధరలను ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ధరలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంటే తన ఉద్దేశం ఒక్కసారిగా టెలికాం ధరలు చుక్కల్ని తాకాలని కాదని అన్నారు. మధ్యస్థంగా ధరలు పెరిగినా సంస్థలకు కాస్త ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టెలికాం సంచలనంగా మార్కెట్లోకి దూసుకువచ్చిన జియో రాకతో దేశీయంగా టెలికాం మార్కెట్లో తీవ్ర టారీఫ్ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఉచిత కాల్సర్వీసలతో పాటు అతితక్కువ ధరకు ఇంటర్నెట్ అందిస్తామంటూ జియో చేసిన ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. దీనికి తోడు కేవలం అనతి కాలంలోనే అత్యధికులు జియో కనెక్షన్లు తీసుకునేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.