Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టపోయాయి. దీంతో సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించలేకపోయాయి. గురువారం ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల చివరి రోజు కావడంతో అమ్మకాల జోరు కొనసాగింది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 35,867 పాయింట్ల వద్ద ముగిసింది, మరోవైపు నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 10,792 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50లో ఓఎన్జీసీ, వేదాంత, కోల్ ఇండియా, బీపీసీఎల్, గెయిల్, ఐఓసీ, ఎన్టీపీసీ, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఓఎన్జీసీ 5 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో టీసీఎస్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్, విప్రో, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్ 3 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లు నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఏకంగా 1 శాతానికి పైగా పతనమైంది. ఇక మిగతావన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఎక్కువగా లాభపడింది.