Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విఫ్ట్ వాడకంలో తప్పులపై బ్యాంకులకు జరిమానా
- చిన్న తప్పులకూ పెద్దగా స్పందిస్తోన్న కేంద్ర బ్యాంక్
ముంబయి: అంతర్జాతీయ చెల్లింపులకు బ్యాంకులు వినియోగించే స్విఫ్ట్ నెట్వర్క్ వాడకంలో ప్రమాణాలను పాటించని దాదాపు 19 బ్యాంకులపై భారతీయ రిజర్వు బ్యాంక్ కన్నెర్రజేసింది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్బీఐ బ్యాంకుల స్విఫ్ట్ వాడకంపై గట్టినిఘా ఉంచింది. ఈ క్రమంలో నిబంధనలను పాటించని బ్యాంకులకు ఎప్పటికప్పుడు తాకీదులను పంపడంతో పాటు.. వారి తప్పులకు పెనాల్టీలను విధిస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి తప్పదాలకు పెనాల్టీ విధిస్తున్న సంఘటనలు గడిచిన నాలుగు రోజులుగా తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని దాదాపు 19 బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. ఆర్బీఐ బ్యాంకులకు విధిస్తున్న జరిమానా మొత్తం రూ.కోటి నుంచి రూ.4 కోట్ల మధ్య ఉన్నట్టుగా బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకులకు విధించిన జరిమానాల మొత్తం ఇటీవలి కాలంలో దాదాపు రూ.40 కోట్లు దాటినట్టుగా బ్యాంక్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బ్యాంకులు చేస్తున్న నిర్మాణాత్మక తప్పిదాలను కాకుండా కౌంటర్ పార్టీ కన్ఫర్మేషన్తో పాటు ఇతర చిన్నచిన్న తప్పులను కూడా ఆర్బీఐ అస్సలు ఉపేక్షించడం లేదని తాజా సంఘటనలతో తెలుస్తోందని రేటింగ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి.