Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఏడో సెషన్లోనూ ఎగిసిన మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల వరద కొనసాగుతోంది. దీంతో దలాల్స్ట్రీట్ లాభాలతో కళకళలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు రూపాయి పుంజుకోవడం తదితర అనుకూలతల నేపథ్యంలో వరుసగా ఏడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాల్లో పరుగులు పెట్టాయి. కొనుగోళ్ల అండతో మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 38,218 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 38,396 గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 268 పాయింట్ల లాభంతో 38,363 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 70 పాయింట్లు ఎగబాకి 11,510 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 68.94గా కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబరు 7 తర్వాత సూచీలు గరిష్ఠస్థాయిలను తాకడం మళ్లీ ఇప్పుడే. మంగళవారం నాటి ట్రేడింగ్లో మౌలిక, రియాల్టీ, బ్యాంకింగ్, విద్యుత్ రంగ షేర్లు రాణించాయి. దిగ్గజ సంస్థలైన రిలయన్స్ ఇండిస్టీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్తో స్టాక్స్ రాణించడం మార్కెట్ల సెంటిమెంట్ను పెంచింది. మార్కెట్ విస్తృతి ఆరోగ్యకరంగా కనిపించింది. బీఎస్ఈలో 1411 షేర్లు లాభాల్లో పరగులు పెట్టగా.. 1295 స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.52 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.37% మేర లాభపడ్డాయి.