Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత ప్రమాదకర జైలులో నీరవ్ మోడీ
- సాధారణ నేరస్థుడిగానే సౌకర్యాల కల్పన..
- డ్రగ్స్, మెంటల్ క్రిమినల్స్తో కలిసి జైలు
- కరడుగట్టిన నేరస్థుల మధ్య కారాగారవాసం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) వేలాది కోట్ల రూపాయల మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్లో కటకటాల వెనుక కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు. పీఎన్బీ మోసం కేసులో అరెస్టయిన మోడీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన వెస్ట్మినిస్టర్ మోజిస్ట్రేట్ కోర్టు ఆయనను ఈ నెల 29వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలంటూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను నైరుతి లండన్లోని హర్ మెజిస్ట్రీ ప్రిజన్ (హెచ్ఎంపీ) వాండ్స్వొర్త్కు తరలించారు. భారత సంపన్నులో ఒకడిగా వెలుగొందిన నీరవ్ మోడీకి బ్రిటన్ ప్రభుత్వం కారాగారంలో మోడీకి ప్రత్యేక గదిని కేటాయిస్తారని అంతా భావించినప్పటికీ జైలు అధికారులు మోడీని సాధారణ నేరస్థుడిగానే భావిస్తూ ఇతర ఖైదీల మాదిరిగానే సౌకర్యాలు కల్పిస్తున్నట్టు బ్రిటన్ మీడియా తెలిపింది.
ప్రత్యక్ష నరకం ఆ జైలు..
భారత్లో జైళ్లు నరకప్రాయంగా ఉంటాయి.. ఇది పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడైన విజరుమాల్యా లండన్ కోర్టులో చేసిన ఆరోపణలు.. ఇలానే భారత్ జైళ్లలో ఉన్న ఇబ్బందులను సాకుగా చూపి నేరస్థులు చక్కగా విదేశాల్లోనే గడిపేస్తుంటారు. కానీ లండన్లో నీరవ్ మోడీని ఉంచిన జైలు భారత జైళ్లకంటే ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని సమాచారం. నీరవ్ మోడీ కస్టడీలో ఉన్న జైలు లండన్లోనే చాలా పురాతన జైళ్లలో ఒకటి. ఇది విక్టోరియా కాలం నాటి జైలు. లండన్లో ఉండే కారాగారాల్లో ఎక్కువగా బిజీగా ఉండే జైలు ఇది. 1851లో నిర్మించిన ఈ ప్రిజన్ బి కేటగిరిలోకి వచ్చే జైలు. ఇక్కడ కరుడుగట్టిన నేరగాళ్లను ఎక్కవగా ఉంచుతారు. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు జబీర్ మోతీని కూడా ఇక్కడే ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ జైలు సామర్థ్యానికి మించి దాదాపు 1430 మంది పురుష ఖైదీలు శిక్షను అనుభవిసుతన్నారు. ఎక్కువగా ఈ జైలులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే వారు, మానసిక పరిస్థితి సరిగా లేక నేరాలకు పాల్పడిన వారు, కరడుగట్టిన నేరస్థులు ఇక్కడ శిక్షణు అనుభవిస్తుంటారని.. ఇప్పుడు మోడీని కూడా వీరితో పాటు జైలు ఉంచడం జరిగిందని లండన్కు చెందిన ఒక ప్రతిక తెలిపింది. ఈ జైలు ఎంత ప్రమాదకరమంటే ఇక్కడి గస్తీ సిబ్బంది కూడా ఒంటరిగా జైలు ఇన్పెక్షన్కు వెళ్లేందుకు కూడా భయపడతారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జైలులోని ఖైదీల్లో గ్రూపులుగా విడిపోయి దాడి చేసుకొంటుండడం ఇక్కడ పరిపాటి. గడిచిన ఏడాది కాలంలో ఈ జైలులో ఆరుగురు ఖైదీలు మరణించారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. ఇక్కడ శిక్షణనుభవిస్తున వారి జీవితానికి పెద్దగా భరోసా ఉండదన్నది స్థానికుల అభిప్రాయం. ఇక్కడి కారాగారాల్లో ఒక్కో గదిలో ఒక్కో నేరస్థుడిని ఉంచేలా రూపొందించినప్పటికీ.. స్థలాభావం వల్ల ఒక్కో గదిలో ముగ్గురు నుంచి నలుగురి ఉంచుతున్నారని. మోడీ కూడా ఇదే పరిస్థితుల మధ్య కస్టడీని అనుభవిస్తున్నట్టుగా మీడియా తెలిపింది. ఇక్కడి నేరస్థులు చాలా కరడుగట్టిన వారు కావడంతో అధికారులు నేరస్థులను జైలు అరుబయటకు పంపడం చాలా అరుదు. దీనికి తోడు ఇక్కడ మరుగుదొడ్లు, స్నానగదుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మీడియా వివరించింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మోడీ కస్టడీ అనుభవిస్తున్నట్టుగా మీడియా తెలిపింది.
భారత్కు రప్పించేందుకు ఆరు నెలలు
నీరవ్ మోదీని భారత్కు రప్పించే ప్రక్రియ కూడా తొందరగానే పూర్తికానుందని సీబీఐ, ఈడీ అధికారులు భావిస్తున్నారు. విదేశాలకు పారిపోయిన మరో ఆర్థిక నేరగాడు విజరు మాల్యా కంటే నీరవ్మోదీని భారత్కు రప్పించే ప్రక్రియ వేగవంతంగా పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఆరు నెలల్లోనే పూర్తికానుందని భావిస్తున్నారు. రవ్ మోదీ కేసులో చీటింగ్, మనీలాండరింగ్కు సంబంధించిన సాక్ష్యాలు బలంగా ఉన్నాయని.. యూకేలో ఇలాంటి కేసుల్లో ద్వంద్వ నేరారోపణలను నిరూపించేందుకు ఇవి సరిపోతాయని సదరు అధికారి తెలిపారు. ఈ కేసులో నీరవ్ మోదీని అరెస్టు చేయడం గొప్ప పురోగతి అని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ ఇప్పటికే పలు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. నకిలీ ఎల్ఓయూ(లెటర్ ఆఫ్ అండర్టేకింగ్)లు, ఈమెయిల్ సంభాషణలు, షెల్ కంపెనీల ఏర్పాట్లపై సాక్ష్యాలను సంపాదించింది. వీటిని ఇప్పటికే యూకే అధికారులకు అందించింది. మరోవైపు భారత్లో నీరవ్ మోదీకి చెందిన రూ. 1,873 కోట్ల ఆస్తులను అటాచ్ చేయగా.. విదేశాల్లో 970 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేశారు. నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ప్రక్రియలో పలు దశలు ఉంటాయని.. ఇవి పూర్తి కావడానికి దాదాపు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.