Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ముసద్దీలాల్' కేంద్రంగా భారీ సోదాలు
- దాదాపు 146 కిలోల బంగారం జప్తు
- 'రద్దు' అక్రమాల నేపథ్యంలో దాడులు
- హైదరాబాద్, విజయవాడలోనూ సెర్చ్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి, వాణిజ్య విభాగం
పెద్దనోట్ల రద్దు సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రెండు తెలుగురాష్ట్రాల్లోని పలు జ్యువెల్లరీ సంస్థలు, వాటి యాజమానుల నివాసాలలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో యాభై మందికి పైగా ఈడీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో జరిపిన ఈ సోదాల్లో సుమారు రూ. 82 కోట్ల విలువైన 145.89 కిలోల బంగారాన్ని ఈడీ జప్తు చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో దొడ్డిదారిన నోట్ల మార్పడికి పాల్పడ్డారనే అభియోగంపై ముసద్దీలాల్ దుకాణాలతో పాటు యజమాని కైలాస్ గుప్తా తదితరుల నివాసాల్లో అధికారులు ఈ సోదాలు జరిపారు. అధికారుల వివరణ ప్రకారం.. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను చలామణి నుంచి రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎంఎస్ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్, ఎంఎస్ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ ప్రయివేటు లిమిటెడ్, వైష్ణవి జ్యువెల్లర్స్ కలిసి భారీ కుట్రకు తెర లేపారని ప్రాథమికంగా ఈడీకి తెలిసింది. ఈ కుట్రలో భాగంగా హైదరాబాద్ జ్యువెల్లరీ సంస్థ ఇతర బులియన్ మార్కెట్ వ్యాపారులను కూడా కలుపుకుని కోట్లాది రూపాయల నగదు మార్పిడికి స్కెచ్ వేశారని అధికారులు వివరించారు. ఇందులో భాగంగానే అదే రోజు 110 కోట్ల రూపాయలను బ్యాంకులలో వివిధ ఖాతాలలో జమ చేశారని, ఆ డబ్బులు ఆ రోజు ఉదయం నుంచి 5200 మంది తమ వద్ద బంగారం కొనుగోలు చేయడానికి ఇచ్చిన అడ్వాన్స్లతో పాటు ఖరీదు చేసిన బంగారం తాలూకు సొమ్ముగా చెప్పుకొచ్చారని ఈడీ పేర్కొంది. అయితే అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అప్పట్లోనే కార్యాలయాలపై సోదాలు జరిపి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే 5200 మంది నుంచి 110 కోట్ల రూపాయల విలువైన నగదును స్వీకరించినట్టుగా సృష్టించి తమ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించిందని ఈడీ తెలిపింది. సీసీ కెమెరాల దృశ్యాల ప్రకారం ఆ సమయంలో దుకాణాల్లో ఎలాంటి విక్రయాలు జరగలేదని తేల్చిందని వివరించింది. వాటిలో 80 కోట్ల రూపాయలను అష్టలక్ష్మి గోల్డ్, శ్రీబాలాజీ గోల్డ్ తదితర బంగారం డీలర్లకు మళ్లించినట్లుగా ఆ తరువాత ఐటీ దర్యాప్తులో బయటపడిందని అధికారులు తెలిపారు. దీనిని ఆధారంగా చేసుకొనే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు హైదరాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ దుకాణాలు ఆ సంస్థ యజమాని కైలాష్ గుప్తా ఇండ్లలోను, శ్రీబాలాజీ గోల్డ్ భాగస్వామి పవన్ అగర్వాల్, అష్టలక్ష్మి గోల్డ్ యజమాని నీల్ సుందర్ థారడ్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనితో ఆగకుండా ఈడీ ఆధికారులు ఆయా సంస్థలకు చార్టెడ్ అకౌంటెంట్లుగా వ్యవహరిస్తున్న సంజరు సర్దా కార్యాలయాల్లోనూ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గతంలో హైదరాబాద్ నగర పోలీసులతో పాటు ఇన్కమ్టాక్స్ అధికారులు జరిపిన విచారణ, నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కైలాస్గుప్తా, అతని కుమారులపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ (పీఎంఎల్ఏ) కింద కేసులను నమోదు చేసినట్టు ఈడీ తెలిపింది తమ విచారణలో 8 నవంబర్ 2016 రోజున తాము తప్పుడు వివరాలతో బంగారం విక్రయం జరిపినట్టుగా చూపించే ప్రయత్నం చేసినట్టు నిందితులు అంగీకరించారని సమాచారం. దీనిపై ఇంకా విచారణ సాగుతున్నదని తెలిపారు.