Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై ఆ సంస్థ యాజమాన్యం సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఆ సంస్థ సిబ్బందికి తాజాగా ఆదేశాలను జారీ చేసింది. సంస్థ గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ తమ సిబ్బందికి సూచించింది. సిబ్బంది మీడియాతో మాట్లాడితే బిడ్డింగ్ ప్రక్రియకు ఇబ్బంది అని తెలిపింది. జెట్ తాత్కాలిక మూసివేతతో సంస్థ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. కార్యకలాపాల రద్దును నిరసిస్తూ ముంబయి, దిల్లీల్లో జెట్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు. దీంతో ఉద్యోగుల నిరసనపై స్పందించిన ఎయిర్లైన్స్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మీడియాకు దూరంగా ఉండాలని సూచించింది. 'మన ఎయిర్లైన్స్ను అందరూ ఇష్టపడుతున్నారు. జెట్ సంక్షోభం గురించి వార్త పత్రికలన్నీ రోజూ కథనాలు రాస్తున్నాయి. ప్రస్తుతం మనం చాలా క్లిష్టమైన దశలో ఉన్నాం. జెట్ కొనుగోలు కోసం మన రుణదాతలు బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇలాంటి సమయంలో మీరంతా మీడియాకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. కేవలం కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగంలోని సిబ్బంది మాత్రమే మీడియాతో మాట్లాడతారు' అని సంస్థ సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత కొన్ని నెలలుగా జీతాలు లేక తాము తమ కుటుంబ సభ్యులు కష్టాలు పడుతున్నామని.. ఈ నేపథ్యంలో తమ గోడును ఇతరులకు చెప్పుకొనే ప్రయత్నం చేస్తే.. ఇప్పుడు దానిపై కూడా యాజమాన్యం నిషేధం విధించడమేంటని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
జెట్ విమానాల్ని మాకివ్వండి ..
- ఎస్బీఐకి ఎయిరిండియా చైర్మెన్ విజ్ఞప్తి
ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థ విమానాలను తమకు లీజుకు ఇవ్వాలని ఎయిరిండియా కోరుతోంది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ చైర్మెన్ అశ్విని లోహాని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మెన్ రజనీష్ కుమార్కు ఒక లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ సంస్థ రుణదాతల బృందానికి ఎస్బీఐ సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో లోహాని ఆయనకు లేఖ రాశారు. సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ వద్ద ఇప్పుడు 16 అతి భారీ విమానాలు ఉన్నాయి. వాటిలో బోయింగ్కు 777-300 ఈఆర్ విమానాలు 10 ఉంటే మిగిలిన ఆరు ఎయిర్బస్కు చెందిన ఏ330ఎస్ విమానాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 5 బోయింగ్ విమానాలను తమకు లీజుకు ఇస్తే కీలకమైన అంతర్జాతీయ రూట్లలో వాటిని వినియోగించుకొని సేవలందిస్తామని ఆ లేఖలో లోహాని వివరించారు. ఈ విషయమై రజనీష్ను లోహాని నేరుగా కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం లండన్, పారిస్, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు విమాన సర్వీసులు నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, జెట్ విమానాల లీజుకు ఒప్పందం కుదిరితే మరిన్ని నగరాలకు సేవలను విస్తరిస్తామని, ఇప్పటికే సేవలు అందిస్తున్న నగరాలకు విమానాల ఫ్రీక్వెన్సీని పెంచుతామని పేర్కొంది.
బ్యాంకులపై ఒత్తిడి తేవోద్దు
ముంబయి: మూతపడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జెట్ ఎయిర్వేస్లను తమ ఆధీనంలోకి తీసుకోవాలని బ్యాంక్ యూనియన్లు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాయి. దీనికి సంబంధించి ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాని మోడీకి ఒక లేఖ రాస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ను అదుకొమ్మని ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తేవొద్దని కోరారు. ఈ దిశగా సర్కారు హామి ఇవ్వాలని వారు కోరారు.
ఆర్థిక నష్టాలతో నేలకొరిగిన జెట్ ఎయిర్వేస్ సంస్థలో కీలక వాటా విక్రయం అమ్మకానికి సంబంధించి రుణదాతలైన బ్యాంకులు ఇప్పటికే బిడ్ల ప్రక్రియను ప్రారంభించాయని.. అయితే ఒకవేళ ఈ ప్రక్రియ విజయవంతం కాకపోతే ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం స్వీకరించాలని వారు కోరారు.
మూతపడిన జెట్ సంస్థను రన్వే ఎక్కించేందుకు గాను రుణదాతలుగా ఉన్న బ్యాంకులు తగిన ఆర్థికసాయం అందించాలన్న దోరణితో ఉన్నారని.. ఇది సబబు కాదని వారు తెలిపారు. జెట్ ఆర్థిక పతనంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది.