Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాదారులకు దక్కింది స్వల్పం
- ఓవర్డ్రాఫ్ట్, నల్లధనం డబ్బు వేస్తామని ఆశలు కల్పించిన మోడీ సర్కారు
న్యూఢిల్లీ : విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15లక్షలు డిపాజిట్ చేస్తామని హామీనిచ్చి మోడీ సర్కారు గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అనంతరం ప్రజలు పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు తెరిచారు. అయితే ఐదేండ్లు గడిచినా ఆ సొమ్ము జన్ధన్ ఖాతాల్లోకి చేరలేదు. కానీ, ఖాతాదారుల డిపాజిట్లు లక్ష కోట్ల రూపాయలకు చేరువయ్యాయి. వాస్తవానికి ఈ ఖాతాలతో ప్రజలకు లబ్ది చేకూరింది స్వల్పమే. పథకంలో ప్రకటించిన ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయమూ ఖాతాదారులకు అందుతున్నట్టు సమాచారం లేదు. జన్ధన్ ఖాతాదారులకు రూ. ఐదు వేల ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నట్టు మోడీ సర్కారు చెప్పింది. తర్వాత దాన్ని రూ. 10వేలకు పెంచినట్టూ ప్రకటించింది. కానీ, ఈ ఓవర్డ్రాఫ్టు ఖాతాదారులందరికీ అందుతున్నట్టు సమాచారం లేదు. సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలతోపాటు మోడీ.. రూ. 15లక్షలు డిపాజిట్ చేస్తానన్న వాగ్దానంతో ప్రజలు జన్ధన్ ఖాతాలు వేగంగా తెరిచారు. బ్యాంకు ఖాతాలు పెరగడంతోపాటు ఖాతాదారుల సొమ్ము పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు చేరింది. ఈ నెల 3న వెల్లడైన ప్రభుత్వ సమాచారం ప్రకారం.. జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 97, 665.66 కోట్లకు చేరిందని తేలింది. మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోడీ వాగ్దానం చేసిన రూ. 15లక్షల సొమ్ము ఏదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మోడీ మంత్రులు మాత్రం 15 లక్షలు వేస్తామని హామీనివ్వలేదని అనడంతో జనాగ్రహం పెల్లుబుకుతున్నది. ఇప్పుడిక బ్యాంకుల్లో ప్రజలు పైసా పైసా కూడబెట్టుకున్న జన్ధన్ కాస్త కార్పొరేట్ల ఖాతాల్లోకి వెళ్లిపోయిందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.