Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్ పెరుగుతున్నా మూసివేతలే..
- కఠిన నిబంధనలు, నిర్వహణ వ్యయమే కారణం
- రెండేండ్లుగా తగిపోతున్న నగదు యంత్రాల సంఖ్య
- బ్యాంకుల విలీనంతో చాలా కేంద్రాల మూసివేత
- కొత్త సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి అంతంతే..
- బ్రిక్స్ దేశాల్లోకి మనవద్దే తక్కువ ఏటీఎంలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ వ్యాప్తంగా స్వయం చలిత నగదు వితరణ యంత్రాల (ఏటీఎం) సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. భద్రత అంశాల్ని కారణంగా చూపుతూ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు.. ఏటీఎంల నిర్వహణ ఖర్చు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు వాటి సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు విరివిగా కనిపించిన ఏటీఎం కేంద్రాలు క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. ఫలితంగా దేశ నలుమూలలా సామాన్య ప్రజలు నగదు కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆర్థిక స్రవంతిలోకి తేవాలంటున్న సర్కారు.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన విధానాలను ప్రోత్సహిస్తుండడంతో ఏటీఎం క్రమంగా కనుమరుగవుతున్నాయి. తాజాగా ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటీఎం లావాదేవీల సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ.. గడిచిన రెండేండ్లలో ఏటీఎం సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సంఖ్య చాలా కనిష్టానికి చేరుకుందని తెలుస్తోంది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే భారత్లో ప్రతి లక్ష మందికి ఉన్న ఏటీఎంల సంఖ్య చాలా తక్కువగా ఉంది. బ్లూమ్బర్గ్ విశ్లేషణ మేరకు ప్రతి లక్ష మంది జనాభాకు రష్యాలో 164, బ్రెజిల్లో 107, చైనాలో 81, దక్షిణాప్రికాలో 68 ఏటీఎంలు ఉండగా.. మన భారత దేశంలో ఈ సంఖ్య కేవలం 22కే పరిమితమైంది. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింతగా తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఖర్చు వద్దనుకుంటున్నారు..
దేశంలో ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. భద్రత నేపథ్యంలో ఏటీఎం యంత్రాలలోని సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాలని సూచిస్తూ.. ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. దీనికి తోడు మోడీ సర్కారు కొత్తగా తెస్తున్న కరెన్సీ నోట్లకు తగ్గట్టుగా యంత్రాల్లోని క్యాసెట్లను మార్చాల్సి వస్తోంది. ఇది అటు ఏటీఎం నిర్వహణ సంస్థలకు ఇటు బ్యాంకులకు తలనొప్పిగా తయారైంది. ఈ వ్యయాన్ని భరించేందుకు అటు బ్యాంకులు గానీ.. ఇటు ఏటీఎం నిర్వహణ బ్యాంకులు గానీ ముందుకు రావడం లేదు. దీంతో చాలా చోట్ల ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోని ఏటీఎంలనే టార్గెట్ చేస్తూ ఈ మూసివేతలు కొనసాగుతున్నాయి. ఏటీఎంల సంఖ్య తగ్గడ వల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ధనికులు, విద్యావంతులు తమ నగదు లావాదేవీలను మొబైల్ చెల్లింపులు, ఈ-వ్యాలెట్ల ద్వారా జరుపుకొంటుంటడంతో వారికి ఏటీఎంల ఎత్తివేత ఇబ్బందిగా అనిపించడం లేదు. మొబైల్ వాడకం అంతగా రాని.. ఆ సౌకర్యం అందుబాటులో లేని ప్రజలు మాత్రం ఏటీఎంల ఎత్తివేతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మార్పుతో ఏటీఎంల భద్రత వ్యయం పెరగడంతో లావాదేవీల వల్ల నిర్వహక సంస్థలకు వస్తున్న రెవెన్యూ తగ్గిపోతుండడం.. లాభదాయకత క్షీణిస్తుండడం తదితరాల కారణంగా ఆపరేటర్లు ఏటీఎం కేంద్రాల మూసివేతకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు వారు అందిస్తున్న ఫీజు తమకు ఏమాత్రం లాభసాటిగా ఉండడం లేదని.. దీన్ని సవరిస్తేనే పరిశ్రమకు కొంత మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు. అయితే ఇది బ్యాంకింగ్ వ్యవస్థ సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయమని వారు అంటున్నారు. వీలైనంత తొందరగా ఈ దిశగా ప్రకటన రాకుంటే రానున్న రోజుల్లో ఏటీఎంల సంఖ్య మరింతగా పడిపోయే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
బ్యాంకుల విలీనంతోనూ ప్రభావం..
ఇటీవలి కాలంలో దేశంలో బ్యాంకుల విలీనం ప్రక్రియ జోరందుకుంటోంది. ఇప్పటికే ఐదు అనుబంధ బ్యాంకులు, ఒక మహిళా బ్యాంక్ను ఎస్బీఐ తనలో విలీనం చేసుకుంది. ఫలితంగా ఎస్బీఐ ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 1000 బ్రాంచీలను మూసివేసింది. దీంతో ఆయా శాఖలకు సంబంధించిన ఏటీఎంలు కూడా మూతబడ్డాయి. దీనికి తోడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ల విలీనంతో బ్రాంచీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకులు తమ ఏటీఎంల సంఖ్యను కూడా కుదించుకుంటూ వస్తున్నాయి. తాజాగా మరిన్ని బ్యాంకుల విలీనం వర్తాలు కూడా వస్తుండడంతో ఏటీఎంల భవితపై మరిన్ని నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఇంటర్చేంజ్ ఫీజుతో కానిచ్చేస్తున్నారు..
ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న వేళ ఆయా బ్యాంకులు కొత్తగా ఏటీఎం ఏర్పాటుకు ఆసక్తి కనబరచడం లేదు. ఇతర బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంల నుంచి తమ ఖాతాదారులు లావాదేవీలు నిర్వహించుకుంటారులే.. అనే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఒక బ్యాంకు కార్డును మరో బ్యాంక్ ఏటీఎంలో వినియోగించుకున్నందుకు గాను కార్డు జారీ చేసిన బ్యాంకు.. సదరు ఏటీఎం బ్యాంక్కు రూ.15ల చొప్పున ఫీజు ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏటీఎంను ఏర్పాటు చేసి నిర్వహించడం వల్ల అయ్యే వ్యయం కంటే ఇంటర్చేంజ్ ఫీజు చెల్లిస్తుండడం లాభదాయకంగా ఉంటుండడంతో బ్యాంకులు దీనికే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కొత్త ఏటీఎంల ఏర్పాటు దాదాపు ఆగిపోయిందనే చెప్పొచ్చు. దేశంలోని డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సహించి తద్వారా కార్పొరేట్ సంస్థలకు మేలు చేయాలన్న వ్యూహంలో భాగంగానే ఏటీఎం సంఖ్య తగ్గిపోతున్నా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.