Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాదిలో భారీగా విలీనాలు..
- పెద్ద వాటితో చిన్న బ్యాంకుల మెర్జర్
- ఇక 9 చిన్న బ్యాంక్స్కు కాలం చెల్లినట్టే!
- పీఎన్బీ, కెనరా బ్యాంకుల్లోకి వరుస
- భారీగా తగ్గనున్న బ్యాంకుల శాఖలు
- కొండెక్కనున్న బ్యాంక్ల్లో కొత్త కొలువులు
- 'ఫైనాన్షియల్ ఇన్క్లూజన్'కు విఘాతమే
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో కార్పొరేట్ బడా బాబుల ఆర్థిక మొసాలతో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) గణనీయంగా పెరుగుతూ ఇబ్బందులు పడుతున్న బ్యాంకులను వీలైనంత త్వరగా పెద్దబ్యాంకుల్లో విలీనం చేయాలని ఆర్థికశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిన్న, మధ్య తరహా బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంకుల్లో విలీనం చేసేలా ఆర్థికశాఖలో కార్యాచరణ మొదలైనట్టుగా తెలుస్తోంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థ వ్యాప్తిలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా వెలుగొందుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు ప్రస్తుతం 159 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు దాదాపు 1,44,952 బ్రాంచీలతో (శాఖలతో) సేవలందిస్తున్నాయి. ఇది భారత్లోని దాదాపు 110 కోట్ల మంది ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చుతూ ప్రజలకు ఆర్థిక సేవలను అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంకుల విలీనానికి గాను ప్రభుత్వం ఇప్పటికే అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. పీఎన్బీ, కెనరా బ్యాంకులు ఆయా బ్యాంకులను విలీనం చేసుకొనే చర్యలను విడివిడిగా చేపట్టనున్నాయి. ఇప్పటికే భారతీయ స్టేట్ బ్యాంకులో అనుబంధ బ్యాంకులను విలీనం దాదాపు పూర్తవడం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనపు ప్రక్రియ మొదలై పూర్తవడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వచ్చే ఏడాది ప్రథమార్థంలోచిన్న బ్యాంకుల విలీనం ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బ్యాంకుల విలీనం మాత్రం కొనసాగుతుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రాబ్యాంక్పై పీఎన్బీ ఆసక్తి..
త్వరలో చేపట్టనున్న మలిదశ బ్యాంకుల విలీన ప్రక్రియలో సర్కారు దుకుడుగా ముందుకు సాగనుందని.. అధికారులు వివరించారు. దీనికి తోడు ఏకకాలంలో వివిధ బ్యాంకుల విలీనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర భారత దేశంలో బలమైన వ్యాప్తిని కలిగి ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ దక్షిణ భారతంలో మేటిగా విస్తరించి ఉన్న బ్యాంకులను విలీనం చేసుకొనేందు ఆసక్తిగా చర్చలు జరుపుతోంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసం, తదనంతర పరిణామాలతో పీఎన్బీ బ్యాంక్ పరిస్థితి కొంత దిగజారింది. బ్యాంక్ ఎన్పీఏలు కూడా 18 శాతం దరిదాపుల్లోకి ఉన్నప్పటికీ పీఎన్బీ మాత్రం ఇతర బ్యాంకుల విలీనంపై దూకుడుగానే ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాబ్యాంక్ను, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ల విలీనంపై పీఎన్బీ ఆసక్తిగా ఉన్నట్టుగా సమాచారం. బ్యాంకుల విలీనంపై ఇప్పటికే కేంద్రంలోని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం 21గా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్యను 6కు తగ్గించి.. వాటిని అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థగా మార్చాలని సర్కారు ఇప్పటికే తన విధానాన్ని వెల్లడించింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఇదే దిశగా సంకేతాలను వెలువరిస్తూ దేశంలో బ్యాంక్ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
పెరుగనున్న ఆర్థిక ఇబ్బందులు..
ప్రతిపాదిత విలీనాల వల్ల సర్కారు ప్రధానంగా ఆశిస్తున్న ఫలాలో అత్యంత ముఖ్యమైనది బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడం. ఇందుకు గాను సర్కారు వ్యయ నియంత్రణ చర్యలను వేగవంతం చేయనుంది. ప్రజావసరాల కోసం ఇప్పుడు ఒక్కో పట్టణంలో రెండు మూడు బ్యాంకులుండగా.. వాటిని తగ్గించనున్నారు. దీంతో ప్రజలుకు ఇబ్బందులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కొత్త శాఖ ఏర్పాటు దాదాపు పక్కనబెట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో కొలువుల కోసం వేచి చూస్తున్న వారికి నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకులు తమకు లాభదాయకమైన చోటే శాఖ ఏర్పాటుకు ఆసక్తి కనబరుసాయి.. దీంతో మారుమూల ప్రాంతాల వారికి.. తక్కువ జనాభా కలిగిన నగరాల వారికి కొత్తగా బ్యాంకింగ్ సేవలు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. మెరుగైన వృద్ధి రేటును సాధించాలంటే అట్టడుగు వర్గాల వారిని ఆర్థిక స్రవంతిలోకి తేవాలంటున్న సర్కారు.. మరోవైపు అందుకు భిన్నంగా విలీనాలు చేపడుతుండడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.