Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల తయారీ సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో స్థానిక అవసరాలను బట్టి ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని తాము భావిస్తున్నామని సంస్థ తెలిపింది. స్థానిక అవసరాలను తెలుసుకొని వ్యాపార విస్తరణపై దృష్టి సారించేందుకు ప్రత్యేకంగా వ్యూహాత్మక వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సునరు భాసిన్ తెలిపారు. తాజా వ్యూహంలో భాగంగా ఎంటీఆర్ కంపెనీ మార్కెట్లోకి మసాలా కారం, సేవియన్ ఉప్మాల ఉత్పత్తులను బుధవారం ఆవిష్కరించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్ల మేర టర్నోవర్ సాధించిన సంస్థ 14 శాతం సీఏజీఆర్తో దూసుకుపోతోందని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సునరు భాసిన్ తెలిపారు. భారత్లో రాష్ట్రాల వారీగా ప్రజల అభిరుచులు మారుతూ ఉన్నందున వివిధ యూనిట్స్ ద్వారా వారికిష్టమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఆయన వివరించారు. ఎంటీఆర్ ఫుడ్స్ అమ్మకాలలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు రెండో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. స్థానిక తెలంగాణ వంటకాలను దృష్టిలో ఉంచుకొనే మార్కెట్లోకి ఎంటీఆర్ మసాలా కారంను మార్కెట్లోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు. గుంటూరు మిర్చీ, వెల్లుల్లి, ఇతర మసాలా దినసులను కలిపి మార్కెట్ అభిరుచి మేరకు తాము మసాల కారంను తయారు చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. కొత్త ఉత్పత్తులను తేవడం, వ్యాపార విస్తరణ, సరికొత్త మార్కెటింగ్ వ్యూహాల నిమిత్తం తాము రూ.30 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆయన తెలిపారు.