Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనకరంగా వ్యక్తిగత రుణాలు పెరుగుదల
- ఆదాయాలు తగ్గడంతో అప్పుల బాటలోకి..
- మందగమనంతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి..
- అవసరాల కోసం వ్యక్తిగత రుణాలకు మొగ్గు
- నాలుగేండ్లలో 89% మేర పెరిగిన రుణాలు
- అప్పుల చెల్లింపులకే సరిపోతున్న ఆదాయాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనంతో పాటు ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రజలు తమ ఆర్థిక అవసరాల నిమిత్తం ఎక్కువగా వ్యక్తిగత అప్పులు చేస్తున్నారు. దీంతో దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో వ్యక్తిగత రుణాల సేకరణ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దేశ పెద్ద బ్యాంక్ ఆర్బీఐ విశ్లేషణాత్మక గణాంకాలతో సహా వెల్లడించింది. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో పాటు వివిధ ఆర్థిక ప్రతిబంధక విధానాల వల్ల దేశంలోని చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు. వ్యవసాయ రంగానికి తగిన దిగుబడి ఆదాయం లభించడం లేదు. వ్యయ నియంత్రణతో పాటు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ఉన్న కొలువులు కూడా ఊడుతున్నాయి. దీనికి తోడు దేశంలో వినియోగం గణనీయంగా తగ్గి ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో దేశంలో సామాన్యులు తమ కుటుంబ పోషణతో పాటు సాధారణ అవసరాల నిమిత్తం ఎక్కువగా వ్యక్తిగత అప్పులు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అప్పులు తీర్చేందుకు గాను ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వదులుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రజల్లో ఎక్కువ మంది తమ రుణ భారాన్ని తగ్గించుకొనే ప్రయత్నంలో నానా అవస్థలు పడుతున్నారన్నది కాదనలేని సత్యం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఇంటి రుణాలు రూ.6.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 80 శాతం అధికం కావడం విశేషం.
89% పెరిగిన వ్యక్తిగత రుణాలు..
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించిన సమాచారం మేరకు 2013-14 నుంచి 2017-18 గడిచిన నాలుగేండ్ల కాలంలో బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యక్తిగత రుణాలు 89 శాతం మేర పెరిగి రూ.19.1 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దేశంలో ప్రయివేటు వినిమయం కేవలం 53 శాతం మేర మాత్రమే పెరిగింది. ఇంటి అవసరాల కోసం తీసుకునే రుణాలతో పోలిస్తే బ్యాంకులు ఇతర పరిశ్రమలకు జారీ చేసిన రుణాలలో కేవలం 7.3 శాతం వృద్ధి మాత్రమే కనిపించడం విశేషం. సమీక్షా కాలంలో ఆహారేతర రుణాలు 39 శాతం మేర పెరిగినట్టుగా గణాంకాలు చెతున్నాయి. 2013-14 నుంచి 2017-18 మధ్య కాలంలో గృహా రుణాల్లో 82% వృద్ధి నమోదు అయింది. మన్నికైన వినియోగదారు వస్తువుల కొనుగోళ్ల కోసం చేసిన రుణాలు 54 శాతం, వాహన రుణాల్లో 78 శాతం మేర వృద్ధి కనిపించింది. కాగా సమీక్షా కాలంలో ఇతర వ్యక్తిగత రుణాల్లో దాదాపు 154 శాతం మేర వృద్ధి నమోదు కావడం గమనార్హం. వ్యవస్థలో ధరలు పెరుగుతున్నంత వేగంగా ఆదాయాలు పెరగ కపోవడం, స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు కనుమరుగవుతుండడంతో అప్పుల బాట పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ కార్డుల బకాయిలు సమీక్షా కాలంలో 176% మేర పెరిగాయంటే ప్రజలు ఎంతగా విత్త సమస్యను ఎదుర్కొం టున్నారో ఊహించవచ్చు. 2013-14 నుంచి 2016-17 మధ్య కాలంలో పోలిస్తే దేశంలో వ్యక్తిగత కుటుంబాలు చేస్తున్న బ్యాంక్ సేవింగ్స్లో కేవలం 18 శాతం వృద్ధి మాత్రమే నమోదు అయింది. ఆ తరువాత నుంచి సేవింగ్స్లో గణనీ యమైన తగ్గుదల నమోదవుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కు వ మంది బ్యాంకుల వద్ద నుంచి కాకుండా బ్యాంకింగేతర విత్త సంస్థల నుంచి ఎక్కువగా రుణాలను తీసుకుంటూ ఉంటారు. మొత్తం ప్రజలు తీసుకునే రుణాల్లో మూడింట రెండో వంతు మాత్రమే బ్యాంకింగ్ సంస్థల వద్ద నమోదు అవుతా యని.. మిగతావి ఎక్కువగా వడ్డీ వ్యాపారులు, ఇతర చిన్న ఫైనాన్స్ సంస్థల వద్ద నమదో అవుతుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.