Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్కు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను అమెరికా రద్దు చేయడంపై మన దేశం స్పందించింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది. ఈ మేరకు భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అమెరికా ఉత్పత్తులకు భారత్లో సమర్థనీయమైన మార్కెట్ లభించడంలేదన్న ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా పంపిన అనేక అభ్యర్థనలపై భారత్ కొన్ని తీర్మానాలు చేసిందని.. కానీ అవేవీ అమెరికా అంగీకరించకపోవడం విచారకరం అని భారత్ ఆ ప్రకటనలో తెలిపింది. ''అమెరికాతో ఇతర దేశాల వలే భారత్ కూడా తన ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. దేశాభివృద్ధికి అనేక అవసరాల తో పాటు ఆందోళనలు కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కూడా మెరుగైన జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. ఈ లక్ష్యమే ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తుంది'' అని భారత్ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే ఇలాంటి నిర్ణయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని భారత్ తేల్చి చెప్పింది. ''హోదా రద్దు అంశాన్ని ఓ సాధారణ ప్రక్రియగానే భావిస్తున్నాం. అమెరికాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కృషి జరుగుతూనే ఉంటుంది. పరస్పర లబ్ధి కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉంది'' అని భారత ఆ ప్రకటనలో తెలిపింది. భారత్కు కల్పించిన జీఎస్పీ హోదాను జూన్ 5 నుంచి తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో 'సమానమైన, సమర్థనీయమైన' వాతావరణం కల్పించడంలో భారత్ విఫలైమందని భావించిన ట్రంప్ జీఎస్పీ రద్దుపై తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా మార్చిలో కాంగ్రెస్కు తెలిపారు. అందుకనుగుణంగా ప్రస్తుతం చర్యలకు దిగడం విశేషం.