Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో పెరుగుతున్న విమానయానాలు
- చైనా, భారత్లో గణనీయంగా పెరగనున్న ప్రయాణికులు
- రెండు దశాబ్దాల్లో ఈ రెండు దేశాల నుంచే సగం మేర వృద్ధి
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులు గాల్లో దూసుకుపోతున్నారు. టికెట్ల ధరలు చౌకగా మారడంతో దేశంలో విమానయానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశీయంగా విమానాయానాలు ఊపందుకున్నాయి. స్పైస్జెట్లాంటి విమానయాన సంస్థలు టికెట్ల ధరలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో చాలా మంది విమానయానాలవైపు మొగ్గారు. ఇటీవలి సంవత్సరాల్లో మనదేశంలో దేశీయంగా, అంతర్జాతీయంగా విమాన ప్రయాణికులు పెరిగారు. ముఖ్యంగా దేశీయంగా విమానయాన మార్కెట్ మాత్రం దూసుకుపోతున్నది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ విమానమార్కెట్రంగంలో భారత్ వరుసగా ఐదుసార్లు మొదటిస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. అయితే విమాన ప్రయాణాల రద్దులు, విమానాశ్రయాల్లోని ఇతర ప్రతికూల పరిస్థితులు, జెట్ ఎయిర్వేస్ నిష్క్రమణం లాంటి కారణాల వల్ల ఏప్రిల్ నెలలో ఈ వృద్ధి ప్రతికూలంగా నమోదైంది. అయితే ఈ ప్రతికూలత తాత్కాలికమేనని, భారత విమానయాన రంగం తిరిగి పుంజుకుంటుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ)కు చెందిన ఆర్థిక వేత్త బ్రియన్ పియర్స్ అంచనా వేశారు.
చైనా, భారత్ నుంచే అధికం :
వచ్చే రెండు దశాబ్దాల్లో చైనా, భారత్లలో పరిస్థితులు విమానయాన రంగానికి అనుకూలంగా ఉంటాయని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అండ్ సీఈవో అలెగ్జాండర్ డి జునిక్ తెలిపారు. వార్షిక సమావేశంలో భాగంగా సంస్థ సభ్యులు సమావేశమైన ఈ కార్యక్రమంలో సీఈవో మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయా దేశాల్లోని డిమాండ్కు తగినట్టుగా సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని అన్నారు. చైనా, భారత్లు విమానయానరంగంలో ప్రయాణికుల డిమాండ్కు తగినట్టుగా సౌకర్యాలు కల్పిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ రెండు దేశాల్లో అన్ని వర్గాల నుంచి విమాన ప్రయాణికులు పెరుగుతారని అంచనా వేశారు. నేటితో పోల్చితే భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక, ఇతర వర్గాలకు అతీతంగా విమాన ప్రయాణికులు పెరుగుతారని తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా రెండు దశాబ్దాల్లో పెరిగే విమాన ప్రయాణికుల్లో దాదాపు సగం(45శాతం) మంది ఈ రెండు దేశాల నుంచే ఉంటారని చెప్పారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా విమానరంగ సమస్యలు, పరిణామాలపై దృష్టిసారిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తక్కువ వైశాల్యంతో ఇరుకుగా ఉండే విమానాశ్రయాలు బోలెడు ఉన్నాయని చెప్పారు. సావోపావ్లో, న్యూయార్క్, లండన్, ఆమ్స్టర్డాం, బ్యాంకాక్, సిడ్నీ విమానాశ్రయాలు ఇందుకు తార్కాణా లన్నారు. అయితే ఆదాయానికి ఆవశ్యకమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు కచ్చితంగా దృష్టిపెట్టాలని తెలిపారు. భారత విమానయాన రంగం వృద్ధి ఏప్రిల్లో కాస్త మందగించిందని, ఇందుకు ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ నిష్క్రమణేనని విశ్లేషించారు. భారత్లో ఇండిగో తర్వాత రెండో అతిపెద్ద విమానసంసగా 2017 అక్టోబర్ వరకు జెట్ ఎయిర్వేస్ కొనసాగిన విషయం తెలిసిందే.
84 విమానాశ్రయాల్లో బాడీస్కానర్లు
దేశవ్యాప్తంగా భద్రతాపరంగా సున్నితమైన, రద్దీగల 84 విమానాశ్రయాల్లో అత్యాధునిక బాడీ స్కానర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్ స్కానర్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నది. ఎయిర్పోర్ట్లలో ప్రస్తుతమున్న భద్రతాయంత్రాలు కేవలం లోహంతో తయారుచేసిన వస్తువులను మాత్రమే గుర్తుపట్టేందుకు వీలుగా రూపొందాయి. నాన్మెటాలిక్ ఆయుధాలను, పేలుడు పదార్థాలను ఇవి గుర్తుపట్టలేవు. కావున వీటితో భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి నూతనంగా ప్రవేశపెట్టబోయే బాడీస్కానర్లు శరీరంలో దాగి ఉన్న మెటాలిక్, నాన్మెటాలిక్ వస్తువులనూ గుర్తుపడతాయి. కనిపించకుండా దాచిన అనుమానిత వస్తువులను సైతం స్కాన్ చేసి వాటి ఆకృతిని చిత్రం రూపంలో చూపెట్టడం ఈ బాడీస్కానర్ల ప్రత్యేకత. మొదట వీటిని ఢిల్లీ, చెన్నై, కోల్కతా వంటి రద్దీగల విమానాశ్రయాల్లో, అలాగే భద్రతాపరంగా సున్నితమైన జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల విమానాశ్రయాల్లో బాడీస్కానర్లను అమర్చాలని ఆయా విమానాశ్రయాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మిగతా విమానాశ్రయాల్లోనూ 2021 కల్లా దశలవారీగా వీటిని ప్రవేశపెట్టాలని సూచించింది.