Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ సమీక్ష నేపథ్యంలో పూర్తి అప్రమత్తత
- 40,000 పైన ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలో ముగిశాయి. మార్కెట్లు సోమవారం జీవితకాల గరిష్టాలను చేరిన నేపథ్యంలో స్టాక్స్ అత్యధిక ధరలకు చేరుకోవడంతో మదుపరులు మంగళవారం లాభాల స్వీకరణకు దిగారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్బీఐ గురువారం ద్వైమాసిక పరపతి సమీక్ష వివరాలను వెల్లడించనున్న నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించడం కనిపించింది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూలతలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయి 40,083 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 12,021 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ నష్టపోయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 40,000 పాయింట్ల మార్క్ వద్ద ముగిసింది. హీరోమోటోకార్ప్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 1.2 శాతం నష్టపోయింది. జీఈ పవర్ఇండియా షేర్లు 5శాతం లాభపడ్డాయి. రూ.738 కోట్ల విలువైన ఆరావళి పవర్ కాంట్రాక్టు దక్కడంతో ఈ షేర్లు దూసుకెళ్లాయి. ఎన్టీపీసీ, హర్యాన పవర్ జనరేషన్ కంపెనీ సంయుక్తంగా ఆరావళి పవర్ను ఏర్పాటు చేశాయి. మణప్పురం ఫైనాన్స్ షేర్లు 5శాతం లాభపడ్డాయి. భారీ వాల్యూమ్స్లో ఈ షేర్లు చేతులు మారాయి. నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ దాదాపు 3 శాతం పెరిగింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటోకార్ప్, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. జీ ఎంటర్టైన్మెంట్ దాదాపు 4 శాతం నష్టపోయింది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు మినహా మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా, ఐటీ షేర్లు ఎక్కువ పడిపోయాయి.