Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ చర్యతో బడా బాబులకే మేలు
- డిమాండ్ పెరిగితేనే వృద్ధి పరుగులు..
- వినిమయం పెంచే చర్యలు చేపట్టాలి
- ఆ దిశగా కనిపించని సర్కారు చర్యలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తన తాజా పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడోసారి. వడ్డీరేట్లను తగ్గించడం ద్వారా వ్యవస్థలో నగదు చౌకగా లభించడంతో.. ప్రజలు ఎక్కువగా వినిమయానికి మొగ్గు చూపుతారని తద్వారా స్తబ్దుగా ఉన్న కీలక రంగాల్లో కార్యకాలాపాలు జోరందుకొని వృద్ధి పరుగులు పెడుతుందన్న ఆర్బీఐతో పాటు సర్కారు ఆశ. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన ప్రస్తుత తరుణంలో వృద్ధిరేటును పెంచేందుకు గాను కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుల ఆలోచన. ఇందులో భాగంగాన కీలక వడ్డీరేట్లలో హ్యాట్రిక్ సార్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు తొమ్మిదేండ్ల కనిష్టానికి దిగి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితలు నెలకొన్నప్పుడు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తాయి. దీంతో రుణాలు విరివిగా లభిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను ప్రకటించేకంటే కూడా వడ్డీరేట్ల తగ్గించడం ద్వారా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఇటీవల చాలా దేశాల కేంద్ర బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు మన ఆర్బీఐ కూడా ఇదే దిశగా అడుగులు వేసింది. అయితే ఆర్బీఐ నిర్ణయానికి స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ మార్కెట్లు రికార్డు స్థాయిలో పడిపో యాయి. దీనికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కీలక వడ్డీరేట్లను తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగి జీడీపీ పరుగులు పెడుతందన్న విశ్వ ఆర్థిక సూత్రం ఇకపై మన ఆర్థిక వ్యవస్థకు పని చేయదని మార్కెట్లు చెప్పకనే చెప్పాయి.
తక్కువ రేట్లతో కార్పొరేట్లకే మేలు..
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించి తొమ్మిదేండ్ల కనిష్టానికి తగ్గించినప్పటికీ ఆ మొత్తం ఫలాలను వ్యవస్థలోని సామాన్యులకు అందించేందుకు గాను బ్యాంకులు సుముఖంగా లేవు. గత రెండు దఫాలుగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తే.. ఆ ఫలితాలను బ్యాంకులు ఎంత వరకు కిందిస్థాయి వరకు తీసుకుపోయాయో మనకు తెలిసిన విషయమే. ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంకులు ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు మరింతగా వడ్డీరేట్లను తగ్గించేందుకు సుముఖంగా లేవు. దీంతో ఈ ఫలితాలు ఆర్థిక వ్యవస్థకు వెంటనే అందుతాయని చెప్పలేం. దీని వల్ల ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు మాత్రమే మేలు జరుగుతుంది. తక్కువ వడ్డీరేట్ల వద్ద కార్పొరేట్ సంస్థలు రుణాలను తీసుకొని తమ విస్తరణ ప్రణాళికల అమలుకు వాడుకొంటారు. దీనికి తోడు ఇప్పటికే ఎక్కువ వడ్డీరేట్ల వద్ద తీసుకున్న రుణాలను.. ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీరేటు రుణాలతో తీర్చేసి లబ్ధిపొందే అవకాశం ఉంది. వడ్డీరేట్లను తగ్గించడం వల్ల ఎక్కువగా కార్పొరేట్ సంస్థలు, కంపెనీలతో పాటుగా వ్యక్తిగతంగా కొందరికి మాత్రమే మేలు జరిగే అవకాశం ఉంది. తక్కువ వడ్డీరేట్ల కారణంగా కార్పొరేట్ సంస్థలు తమ దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలకే రుణాలను స్వీకరించి వాడుకుంటారు తప్ప.. తక్షణం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేయరు. ఎందుకంటే వ్యవస్థలో వినిమయం తగ్గి డిమాండ్ క్రమంగా క్షిణిస్తూ వస్తోందని సూక్ష్మ గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కవ రేటుకు తెచ్చిన రుణాలను తక్కువ రేటు రుణాలతో భర్తి చేయడంతో తమ లాభాలను పెంచుకొనేందుకు కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.
వినిమయం పెంచే చర్యలుండాలి..
ఆర్థిక వ్యవస్థలో వినిమయం తగ్గడం మూలంగా వృద్ధి క్రమంగా మందగిస్తూ వస్తోంది. సరైన డిమాండ్ లేక ఇప్పటికే కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఫలితంగా ప్రజలకు విరివిగా నగదు అందుబాటులోకి రావడం లేదు. డబ్బులేక కొనుగోలు శక్తి తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావడం లేదు. ఉన్న ఉద్యోగాలకు కూడా టెక్నాలజీ ఎసరు పెడుతుండడంతో తగిన భరోసా లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గడంతో పరిశ్రమలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణ దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ కార్ల అమ్మకాలు పడిపోవడంతో తమ ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. తాజాగా ఉత్పత్తి నియంత్రణకు గాను కార్మికులకు రెండు రోజుల సెలువులు కూడా ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడ్డీరేట్లను తగ్గించుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని భావిస్తుండడం సరైంది కాదు. ఈ నేపథ్యంలో వ్యవస్థలో వినిమయం పెరిగేలా చర్యలు చేపట్టాలి.. ఇందుకు గాను ప్రధానం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా తగ్గి కార్యాచరణను ఎత్తుకొని ముందుకు సాగితే మేలు. గ్రామీణ భారతావనిలో అన్నదాతలదే ప్రధాన పాత్ర అయినందును వారికి తగిన ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలి. పండించిన పంటకు తగిన మద్దతు ధరను కల్పిస్తే వారి ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా కొనుగోలు శక్తి పెరిగి వినిమయం పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. దీనికి తోడు అత్యధికంగా ప్రభుత్వ వ్యయం పెంచి మౌలిక రంగంతో పాటు ఇతర ప్రధాన రంగాలలో కొత్త కొలువులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. దీని వల్ల కొత్త కొనుగోలు శక్తి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. కావున ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితేనే మందగించిన ఆర్థిక వ్యవస్థ చలనం ఏర్పడి వృద్ధి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అంతేగానీ వరసుగా వడ్డీరేట్లను తగ్గించుకుంటూ పోతే లాభం లేదన్నది కాదనలేని సత్యం.