Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 శాతం కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు!
- పలుచోట్ల కార్మికుల ఆందోళనలు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థలపై సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగులకు శరాఘాతంగా మారుతోంది. తొలుత కుట్రపూరితంగా నిర్లక్ష్యం వహించి అటుతర్వాత పెట్టుబడుల ఉపసంహరణకు సర్కారు అడుగులు వేస్తున్నదని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సర్కారు సిద్ధమైంది కూడా. తాజాగా సర్కారు నిర్లక్ష్యం, నిధుల కొరతల వల్ల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. ఈ మేరకు 30శాతం కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని దేశంలోని అన్ని సర్కిల్ హెడ్ కార్యాలయాలకు కార్పొరేటు కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఉన్నతాధికారులతో జరిగిన పలు సమీక్షా సమావేశాల్లో సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, నిధుల కొరతను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, అందులో భాగంగానే ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు సిద్ధమైందని కార్పొరేట్ కార్యాలయం పంపిన లేఖలో పేర్కొంది. కాగా, కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే ఒప్పంద కార్మికులను తొలగించారని బీఎస్ఎన్ఎల్ ఒప్పంద కార్మికుల సమాఖ్య అధ్యక్షులు నంబూద్రి తెలిపారు. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల్లో కార్మికులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారని చెప్పారు.
తేలని పెండింగ్ వేతనాల లెక్కలు
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఒప్పంద కార్మికుల వేతనాలు కనీసం ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లాంటి కొన్ని రాష్ట్రాల్లో 10-11 నెలల వేతనాలు పెండింగ్లోనే ఉండటం గమనార్హం. కాగా, ఇప్పటికే తొలగించిన కార్మికుల వేతనాలు ఇంకా వారికి అందలేవు. ఈ వేతనాలపై అనిశ్చితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పలు కాంట్రాక్టర్ల ద్వారా వీరు ఉపాధి పొందినప్పటికీ.. వారికి వేతనం, ఇతర ప్రయోజనాలను బీఎస్ఎన్ఎల్ కల్పిస్తున్నది.
ఐదు నెలలుగా కాంట్రాక్టర్లు సంస్థ నుంచి డబ్బును కోరగా.. నిధుల కొరత వల్ల ఇవ్వలేకపోతున్నామని యాజమాన్యం తెలిపింది. 18 ఏండ్లలో బీఎస్ఎన్ఎల్ మొదటిసారిగా గతమార్చి నెలలో రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి సర్కారు హామీలను ప్రకటిస్తున్నా.. ఆచరణలో మాత్రం ఆమడదూరంగానే ఉన్నదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.