Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశ పెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్తను వెలువరించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్బీడీఏ) లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్గా పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు విత్ డ్రాలపై నిబంధనలను కూడా స్వల్పంగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. నెలకు 4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి తోడు బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లు అయినా సొమ్మును డిపాజిట్ చేసుకునే సదుపాయంతో పాటు ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఇప్పుడు కేంద్ర బ్యాంకు తొలగించింది. వీరికి కనీస సదుపాయాలకు తోడు చెక్బుక్తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు గాను ఇప్పటి వరకు వసూలు చేస్తున్న మినిమం బాలెన్స్ చార్జీలు వసూలు చేయరాదని ఆర్బీఐ పేర్కొంది. దీంతో బీఎస్బీడీ ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఏటీఎం కార్డు, పాస్పుస్తకం లభించనుంది. అయితే ఈ ఖాతా తీసుకొనే వారు బ్యాంకులో మరే ఇతర ఖాతాను కలిగి వుండరాదు. ఒక వేళ వుంటే అకౌంట్ను ఓపెన్ చేసిన 30 రోజుల వ్యవధిలోనే సదరు ఖాతాను మూసి వేయాల్సి వుంటుంది. అంతేకాదు నో ఫ్రిల్ ఖాతాలను తెరవడానికి ముందే...తనకు ఇతర బ్యాంకుల్లో బీఎస్బీడీ ఖాతా ఏదీ లేదని ధ్రువీకరణ పత్రాన్ని ఖాతాదారు బ్యాంక్కు అందిచాల్సి ఉంటుంది.