Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిన్వెష్ట్మెంట్ వైఫల్యంతో సర్కారు కొత్త ప్లాన్
- ఈ దిశగా ఇప్పటికే ముగిసిన ప్రాథమిక చర్చలు
- భారీగా నిధుల కోసం సర్కారు వినూత్న ఆలోచన
- జాబితా తయారీ పనులు త్వరలో నిటి ఆయోగ్కు!
న్యూఢిల్లీ: సంపూర్ణ మెజార్టీతో మరోమారు అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని సర్కారు ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తాజాగా సర్కారు లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. నష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలన్న మోడీ సర్కారు ప్రయత్నాలకు సరైన స్పందన రాకపోవడంతో పాటు దేశంలో ద్రవ్యలోటు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. మోడీ సర్కారు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా ఆలోచనలో భాగంగా వ్యూహాత్మకం కాని లాభాల్లో ఉన్న ఏయే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటికరిచేందుకు వీలుందో ఒక జాబితాను తయారు చేయమని సర్కారు త్వరలోనే నిటి ఆయోగ్ను కోరనుందని ఆర్థిక శాఖకు చెందిన ఆధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగినట్టుగా సదరు అధికారి వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాలను నోటిఫై చేసిన తరువాత ఈ అంశాన్ని సర్కారు సీరియస్గా పరిగణించనుందని ఆ అధికారి తెలిపారు. లాభాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించే విషయమై అన్ని అంశాలను విశ్లేషించిన తరువాత ప్రధాన మంత్రి కార్యాలయం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం దాదాపు రూ.90,000 కోట్ల భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దీనికి తోడు ఇటీవలి ఎన్నికల్లో మోడీ సర్కారు స్థాయిని మరచి మరీ.. హామీల వర్షాన్ని కురిపించింది. ఈ నేపథ్యంలో సర్కారుకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు తగిన నిధులు లభించడం కష్టంగా మారింది. వృద్ధి మందగించడంతో పాటు పన్ను ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో సర్కారు ద్రవ్యలోటు భారం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిధిలోని స్కూటర్స్ ఇండియా లిమిటెడ్, భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్, ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా, హిందుస్థాన్ ప్రీఫ్యాబ్, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్, ఎయిరిండియాతో పాటుగా 24 ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ వాటిని కొనుగోలు చేసేందుకు మార్కెట్ల నుంచి పెద్దగా ఆసక్తి కనబడట లేదు. దీంతో లాభాలలో ఉన్న సంస్థలను ప్రయివేటుకు విక్రయిస్తే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని సర్కారులోని ఒక వర్గం ఆలోచనగా తెలుస్తోంది. దీనికి తోడు ప్రయివేటు లాభీ కూడా సర్కారుపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం.
రేపే నిటి ఆయోగ్ సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నిటి ఆయోగ్ గౌవర్నర్ కౌన్సిల్ ఐదో సమావేశం శనివారం జరుగనుంది. మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు రెండో సారి అధికారంలోకి వచ్చాక నిటి ఆయోగ్ సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సమస్యలతో పాటు రైతులకు మెరుగైన మద్దతు ధర, తీవ్రవాద సమస్యలపై చర్చ జరగనున్నట్టుగా సమాచారం.
ఆస్తుల నగదీకరణ షరూ..!
డిజిన్వెష్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా సర్కారు చాలా సంస్థల్లో వాటాలను గంపగుత్తగా విక్రయించలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు కలిగి ఉన్న విలువైన ఆస్తులను ఎంపిక చేసి వాటిని విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. విభజించి.. విక్రయించు విధానంలో సర్కారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సర్కారు ఎయిరిండియాతో పాటు పలు ప్రభుత్వ సంస్థల భవనాలను, ఇతర విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కారు లాభాల్లో ఉన్న సంస్థలకు ఉన్న విలువైన ఆస్తుల చిట్టాను కూడా రూపొందిస్తున్నట్టు సమాచారం. లాభాల్లోని సంస్థల నుంచి వీలైన గరిష్ట స్థాయిలో ఎలా లబ్ధి పొందాలనే విషయమై అధ్యయనం చేపట్టాల్సిందిగా సర్కారు నిటి ఆయోగ్కు ఆదేశాలిచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తాము సర్కారు ఆదేశాల మేరకు గరిష్ట ప్రజా ప్రయోజనాల మేరకే పని చేస్తున్నామని తాజా నిర్ణయానికి నిటి ఆయోగ్ను తప్పుపట్టొద్దని మరో అధికారి తెలిపారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలకు సర్కారు నుంచి ముప్పు ఉందన్నది మాత్రం నిజం!