Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన యూకో బ్యాంక్
న్యూఢిల్లీ : బిర్లా సూర్య లిమిటెడ్ డైరెక్టర్ యశోవర్ధన్ బిర్లా.. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ ప్రకటించింది. రూ. 67.65 కోట్ల రుణాన్ని ఉద్దేశపూర్వకంగానే తిరిగి చెల్లించడం లేదని బ్యాంక్ వెల్లడించింది. బిర్లా సూర్యకు రూ. 100 కోట్ల క్రెడిట్ లిమిట్ను యూకో బ్యాంకు అందించింది. కంపెనీ తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో 2013 జూన్ 3 ఈ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించింది. అనేక నోటీసులు పంపించినప్పటికీ ఆ కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించలేదని యూకో బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో బిర్లా సూర్య లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ప్రమోటర్లను బ్యాంకు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఒక విత్తసంస్థలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ చెల్లించనివారిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ముందు చెప్పిన అవసరాలకు కాకుండా ఇతర సంస్థలకు, ఇతర అవసరాలకోసం తీసుకున్న రుణాన్ని మళ్లించినప్పుడూ ఇలా ప్రకటిస్తారు. యూకో బ్యాంకు నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు ఇటీవలే బ్యాంకు అధికారులు తెలిపారు. ఎన్పీఏలను తగ్గించేందుకు సాధ్యమైన మార్గాలన్నీ అనుసరిస్తామని యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎకే గోయల్ ఇది వరకు ప్రకటించారు. యూకో బ్యాంకు మొదటి రూపమైన యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ను 1943లో గనశ్యాం దాస్ బిర్లా స్థాపించారు. యశోవర్ధన్ బిర్లా తాత తండ్రి(గ్రేట్ గ్రాండ్ ఫాదర్) రామేశ్వర్ దాస్.. గనశ్యాం దాస్ బిర్లా సోదరుడే కావడం విశేషం.