Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ కీలక సమాలోచనలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మోడీ శనివారం (21న) దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. వృద్ధిరేటు మందగించడంతో పాటు ఉద్యోగ కల్పన కనిష్టానికి పడిపోతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సమావేశంలో సమాలోచనలు జరపునున్నట్టుగా సమాచారం. నిటి ఆయోగ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నిటి ఆయోగ్కు చెందిన కార్యాచరణ విభాగం అధికారులతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు మంత్రులు పాల్గొననున్నట్టుగా సమాచారం. మార్చి ముగింపు నాటికి వృద్ధిరేటు ఐదేండ్ల కనిష్టానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించిన నేపథ్యంలో సర్కారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
ముఖ్య అధికారులతో మోడీ మీటింగ్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనంతో పాటు దిగజారుతున్న వృద్ధిని పట్టాలెక్కించేందుకు, ఉద్యోగాల కల్పనకు గాను మినిస్ట్రీల 100 రోజుల ప్రణాళికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. ఆయా ప్రభుత్వ శాఖలు సమర్పించనున్న 100 రోజుల ప్రణాళి కలకు తుది మెరుగులు దిద్దేలా ఈ సమావేశంలో దిశానిర్దేశనం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక శాఖకు చెందిన మొత్తం ఏడుగురు కార్యదర్శులు, పలువురు మంత్రులు, నిటి ఆయోగ్ అధికారులు పాల్గొన్నట్టుగా సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చేందుకు గాను వచ్చే ఐదేండ్ల కాలంలో ఎలాంటి విజన్తో ముందుకు సాగాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం.