Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిల్ని చెల్లించమంటున్న విదేశీ బ్యాంకులు
న్యూఢిల్లీ: రుణ భారం కారణంగా దివాలా ఊబిలో కూరుకుపోయి ఆస్తులను అమ్ముకుంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. చైనాతో చెందిన పలు బ్యాంకులు తాము రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) మంజూరు చేసిన 2.1 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించాలని కోరుతున్నాయి. గతంలో చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఇండిస్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు అనిల్ అంబానీ కంపెనీకి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వరంగంలోని చైనా డెవలప్మెంట్ బ్యాంక్ రూ.9,860 కోట్లు. ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్ల మేర రుణాలను అనిల్ అంబానీ కంపెనీలకు అందించాయి. ఇప్పుడు ఆయా బ్యాంకులు అనిల్ అంబానీని రుణాలు తిరిగి చెల్లించాల్సిందిగా కోరుతున్నాయి. ఇది కాకుండా రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యా రూ.511 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్కాంగ్) డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ల వద్ద కూడా అనిల్ అంబానీ భారీగా అప్పులు చేశారు.
సంస్థలు దివాలా తీస్తుండడంతో ప్రస్తుతం ఈ అప్పులకు సంబంధించిన బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయి. దీంతో విదేశీ బ్యాంకులు తమ సొమ్మును రాబట్టుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వీటికి తోడు ఆర్కామ్ దేశీయంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.4910 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.2700 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 2090 కోట్లు మాడిసన్ పసిఫిక్ ట్రస్ట్కు రూ.2350 కోట్లు బకాయి ఉంది. దీంతో సంస్థ మొత్తం అప్పులు రూ.57,382 కోట్లకు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా ఇటీవలే అనిల్ అంబానీ తన బకాయిల విషయమై స్పందిస్తూ ఆస్తులు అమ్మి అయినా తన మొత్తం అప్పులను తీర్చేస్తామని తెలిపిన సంగతి విదితమే.
బిలియనీర్ల క్లబ్ నుంచి అవుట్..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల (బిలియనీర్ల) క్లబ్లో అడాగ్ గ్రూపు సంస్థల అధినేత అనిల్ అంబానీ పేరు గల్లంతయింది. ఇటీవలి కాలంలో ఆయన సంపద గణనీయంగా పడిపోతుండడంతో అనిల్ అంబానీ పేరు బిలియనీర్ క్లబ్ నుంచి పడిపోయింది. 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆ స్థానాన్ని కోల్పోయారు. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ రూ.3,651 కోట్ల రూపాయలకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలడంతో కుబేరుల జాబితాలో ఆయన పేరు గల్లంతయింది. టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అప్పుల సంక్షోభంలో కూరుకపోవడంతో పాటు ఇతర గ్రూపు సంస్థలు కూడా వరుస నష్టాలను నమోదు చేస్తుండడంతో అనిల్ వ్యాపార సామ్రాజ్యం క్రమంగా పతనమవుతూ వస్తోంది. మ్యూచుఫల్ ఫండ్ జాయింట్ వెంచర్ రిలయన్స్ నిప్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్లో బ్యాంకులు 43 శాతం వాటాలను విక్రయించడం అనిల్కు షాకింగ్ పరిమాణం. దీనికి తోడు రుణాలను తీర్చేందుకు ప్రధాన ఆస్తులు వ్యాపారాల అమ్మకంతో అనిల్ అంబానీ సంపద బాగా క్షీణించింది. గత గత 14 నెలల్లో ఆయన రూ .35 వేల కోట్లకు పైగా రుణాలు తీర్చారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018 ,మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.