Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 ఎకరాలలో ఏర్పాటుకు యోచన
- త్వరలో తెలంగాణ సర్కారుతో త్వరలో చర్చలు:
కల్యాణి గ్రూపు చైర్మెన్ బాబా వెల్లడి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కల్యాణి రాఫెల్ ఆడ్వాన్స్డ్ సిస్టమ్స్ (కేఆర్ఏఎస్) రక్షణ రంగంలో భారీ ఆర్డర్ను సొంతం చేసుకుంది. ఇజ్రాయిల్కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి 1000 బరాక్-8ఎంఆర్ఎస్ఏఎం మిస్సైల్స్ కిట్ల తయారీకి సంబంధించిన రూ.684 కోట్ల (100 మిలియన్ డాలర్ల) ఆర్డర్ను సంస్థ చేజిక్కించుకుంది. ఈ కిట్లను తరువాత కాలంలో ఇజ్రాయిల్ సంస్థ భారత ఆర్మీ, ఎయిర్ఫోర్స్లకు అందజేయనుంది. గురువారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రతులను ఇరు సంస్థల ప్రతినిధులు మార్చుకున్నారు. కేఆర్ఏఎస్లో రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు, భారత్ ఫోర్జ్ సంస్థకు 51 శాతం వాటా ఉంది. ఈ ఒప్పందం నేపథ్యంలో భారత్ ఫోర్జ్ సంస్థ షేరు గురువారం మార్కెట్లో దాదాపు 04 శాతం మేర పెరిగాయి.
హైదరాబాద్లో తయారీ..
రాఫెల్ రక్షణ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న కాల్యణి గ్రూపు చైర్మెన్ బాబా కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో తాము రెండో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్ సమీపంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు గాను తాము త్వరలోనే తెలంగాణ సర్కారుకు ప్రతిపాదనలను సమర్పించి చర్చలు జరపనున్నట్టుగా ఆయన వివరించారు. సంస్థ ఉత్పత్తిని పెంచేందుకు, దేశ రక్షణ అవసరాలతో పాటు విదేశీ డిమాండ్ను తట్టుకొని ఉత్పత్తిని చేపట్టేలా హైదరాబాద్లో వ్యూహాత్మకంగా ప్లాంట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ 300 మంది టెక్నిషియన్లను కలిగి ఉన్నట్టుగా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో రక్షణ రంగంలో అపారమైన వ్యాపార అవకాశాలున్నట్టుగా ఆయన తెలిపారు.