Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంధులు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు ఉపయుక్తంగా ఉండే మొబైల్ యాప్ను త్వరలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ అందుబాటులోకి తేనుంది. మోడీ సర్కారు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం పెద్దమొత్తంలో నగదు చెలామణిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ. 10, 20, 50, 100, 200, 500, 2000ల నోట్లు చెలామణిలో ఉన్నాయి. రూ. 1 నోటును ఆర్బీఐ జారీ చేసినప్పటికీ పెద్దగా చెలామణిలో లేదు. రూ. 100 కంటే విలువైన నోట్లను పాక్షిక, పూర్తి అంధత్వం ఉన్నవారు ఇంటాగ్లియో ప్రింటింగ్ ద్వారా గుర్తుపట్టేవారు. కానీ, మోడీ సర్కారు రూ. 500, 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 500, 2000 నోట్లను కొత్త రూపంలో చెలామణిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్త నోట్లతో లావాదేవీలు చూపుసమస్య ఉన్నవారికి సవాలుగా మారింది. దీనిపై ఆర్బీఐ స్పందిస్తూ.. ఈ సమస్యను తాము పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. అంధులూ కరెన్సీతో సులువుగా లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడేలా మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత ఈ మొబైల్ యాప్ కొత్త, పాత నోట్లను చిత్రించి గుర్తిస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఆ యాప్ ఆడియో నోటిఫికేషన్లను ఇస్తుంది. దేశంలో కంటిచూపుతో బాధపడుతున్నవారు దాదాపు 80లక్షల మంది ఉన్నట్టు అంచనా.