Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక సమస్యతో ఆగిపోయిన సర్వీసులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి బ్యాంక్ సర్వర్లు మొరాయించడంలో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయాయి. మరోవైపు ఎస్బీఐ ప్రత్యేక ఇంటర్నెట్ సేవల యాప్ యోనో కూడా పని చేయలేదు. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్స్కు లాగిన్ కాలేకపోయారు. దీంతో మొబైల్ బ్యాంకింగ్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు ఆందోళన చెందారు. ఖాతాదారుల ఆర్థిక లావాదేవీలకు విఘాతం కలిగింది. సేవలకు అంతరాయం ఏర్పడటంతో బ్యాంక్ కస్టమర్లు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. అయితే దీనికి సంబంధించి ఉదయం బ్యాంక్ నుంచి ఎలాంటి వివరణ వెలువడలేదు. కొన్ని గంటల తరువాత ఆలస్యంగా మేలుకొన్న వివరణనిస్తూ సాంకేతిక కారణాల వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతోందని.. త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్టుగా తెలిపింది. తొలత 1.30 తరువాత సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంక్ వివరణనిచ్చింది. అయితే సాయంత్ర 4 గంటల వరకు కూడా సేవలు అందుబాటులోకి రాలేదు. ఆ తరువాత బ్యాంక్ వివరణనిస్తూ 'సమస్యకు చింతిస్తున్నాం. మేం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. అతిత్వరలోనే పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి' అన్న సమాచారాన్ని నెట్ బ్యాంకింగ్, ఐవోఎస్ అప్లికేషన్లలో అందుబాటులో ఉంచింది. కడపటి వార్తలు అందే వరకు కూడా ఇంటర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడలేదు. అయితే ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంక్ ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలుగడం అందరినీ అశ్చర్యపరిచింది. మరోవైపు ఇందుకు గల అసలు కారణాన్ని బ్యాంక్ వెలువరించకపోవడంతో ఖాతాదారుల్లో అందోళన మరింత పెరిగిపోయింది. ఈ తరుణంలో సేవలు నిలిచిపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది.