Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో సెషన్లోనూ వదలని నష్టాలు
ముంబయి: బలహీనమైన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ భారీ నష్టాలను నమోదు చేశాయి. మందగమన పరిస్థితుల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్లు పూర్తిగా నష్టాలలోనే కదలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 306 పాయింట్లు నష్టపోయి 38,031 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 11,346 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ముగించాయి. మే 17 తరువాత సెన్సెక్స్ ఇంత కనిష్టానికి చేరడం ఇదే తొలిసారి. ఫలితంగా గడిచిన మూడు సెషన్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈ మార్కెట్ సూచీ దాదాపు 1,184.15 పాయింట్ల (3.05 శాతం) మేర కుంగినట్టయింది. సోమవారం బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1.15 మేర కుంగాయి. బీఎస్ఈలో 1,757 స్క్రిప్స్ నష్టాల్లో నిలవగా, 786 స్టాక్స్ లాభాలలో నడిచాయి. దాదాపు 600 స్క్రిప్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. కార్పొరేట్ సంస్థలు నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుండడానికి తోడు ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు కొనసాగుతున్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆర్థిక సేవల సూచీలు 0.2 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, లోహరంగ సూచీలు 1 శాతం లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీస్, హిందూస్థాన్ యూనీలీవర్, కొటాక్ మహీంద్రా బ్యాంక్లు అత్యధికంగా నష్టపోయాయి. బజాజ్ ఫినాన్స్ సర్వీసు షేర్లు రెండు నెలల కనిష్టానికి చేరాయి. మరోపక్క హెచ్డీఎఫ్సీ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా దాదాపు 6 శాతం నష్ట పోయాయి. ఈ కౌంటర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో షేర్లు కుంగాయి. రియల్టీ, బ్యాంక్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ప్రయివేట్ రంగ బ్యాంక్ కౌంటర్లలో ఆర్బీఎల్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, డీసీబీ, కొటక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ ఫస్ట్ నష్టపోయాయి. రియల్టీ కౌంటర్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబెరారు, ఇండియాబుల్స్, సన్టెక్, ప్రెస్టేజ్, ఫీనిక్స్, బ్రిగేడ్, మహీంద్రా లైఫ్, శోభా నష్టాల్లో కొనసాగాయి. యెస్ బ్యాంకు, వేదాంతా, ఇండిగో సన్ఫర్మా లాభాల్లో కొనసాగాయి. విదేశీ సంస్థాగత మదుపరులకు భారత మార్కెట్లను ఆకర్షణీయంగా మారే పరిణామాలు చోటు చేసుకొనే వరకు పతనం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.