Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఏపీఐతో జట్టు కట్టిన అపోలో హెచ్ఎన్జీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పేద రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సలహాలను అందిం చేందుకు గాను అపోలో హాస్పిటల్స్ గ్రూపు సంస్థ హెల్త్నెట్ గ్లోబల్ (హెచ్ఎన్జీ), అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్తో (ఏఏపీఐ) జట్టు కట్టింది. వివిధ జబ్బులకు చికిత్సను మొదలుపెట్టే ముందు అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన మేటి ఫిజిషియన్స్ నుంచి దిత్వీయ అభిప్రాయాన్ని సేకరించేలా హెచ్ఎన్జీ సంస్థ ఏఏపీఐతో సోమవారం హైదరాబాద్లో ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఎంవోయూ ద్వారా అందించే టెలీమెడిసిన్ సేవలతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రపంచ స్థాయి ఉత్తమ వైద్య సేవలను అందించేందుకు వీలు కలుగు తుందని ఏఏపీఐ అధ్యక్షుడు సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సహకారం ద్వారా తమ సంస్థ సభ్యులు మాతృభూమికి చెందిన ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించనుందని ఆయన అన్నారు. తమ వద్ద అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఏఏపీఐ సేవలను దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించేలా ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు జేఎండీ సంగీత రెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్స్ ఇటీవలే కోటి టెలీకన్సెల్టెన్సీలను పూర్తి చేసుకుందని ఆమె వెల్లడించారు. ఈ సేవలు మరో 90 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఏఏపీఐ ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకొందని సురేష్ రెడ్డి వివరించారు. హెచ్ఎన్జీ ద్వారా తొలి విడుతలో జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్లలో ఉచిత వైద్య కన్సెల్టెన్సీ సేవలను అందించనున్నట్టుగా ఆయన వివరించారు.