Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి వల్ల బ్యాంక్ పనితీరుపై పడుతున్న ప్రభావం గురించి చర్చించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) శనివారం తెలంగాణ సర్కిల్ పరిధిలో కీలక సమావేశం నిర్వహించింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం తొలిరోజు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న వివిధ ఆర్థిక సమస్యలపై చర్చ జరిగింది. కె. విజయ రాజు స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమాలోచనల సదస్సుకు బ్యాంక్ హైదరాబాద్ జోన్ ప్రభుత్వ వ్యాపార విభాగం డీజీఎం కాంతారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ రంగాలకు రుణాల జారీని పెంచేందుకు గాను ఎదురవుతున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ మీటింగ్లో సమీక్షించారు. సమావేశానికి హాజరైన తెలంగాణలోని బీవోబీ బ్రాంచీల అధినేతలు, అధికారులు ఈ దిశగా పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. వివిధ అంశాలపై విషయ ప్రావీణులు రూపొందించిన వివిధ సమీక్షా పత్రాలపై కూడా ఈ మీటింగ్లో చర్చ జరిగింది. బ్యాంక్ల అభివృద్ధితో జాతీయ వృద్ధి ఎలా ముడిపడి ఉంది.. దేశాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో లోతుగా చర్చలు జరిపారు. ఆదివారం కూడా కొనసాగనున్న ఈ సమాలోచనల సదస్సుకు బ్యాంక్ తెలంగణా జోనల్ హెడ్ పి. శ్రీనివాస్ పాల్గొననున్నట్టుగా బీవోబీ ఒక ప్రకటనలో తెలిపింది.