Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పసిడి ధర మళ్లీ పరుగులు పెడుతోంది. పది గ్రాముల బంగారం ధర రూ.40వేలకు చేరువగా వెళ్తోంది. తాజాగా మంగళవారం నాటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.200 పెరిగి, రూ.38,770 వద్ద ఆల్టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గకపోవడంతో పసిడి ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ఏకంగా రూ.1,100 తగ్గి రూ.43,900లకు చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నా దేశీయంగా బంగారం ధర పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా వ్యాపారులు, ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. రూపాయి బలహీన పడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి రూ.38,770కు చేరింది. గత శనివారం 10గ్రాముల బంగారం రూ.38,670కు చేరి ఆల్టైమ్ రికార్డు ధరను నమోదు చేయగా, మంగళవారం పసిడి మళ్లీ తన రికార్డు బద్దలుకొట్టింది. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించేందుకు ముందుకు వస్తున్నట్టుగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సమీప భవిష్యత్తులో ధరలు తగ్గితే మళ్లీ వీరు పసిడిని కొనుగోలు చేస్తుంటారని వారు వెల్లడించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పట్లో భారీగా దిగివచ్చే అవకాశాలైతే లేవని వారు చెబుతున్నారు.